Begin typing your search above and press return to search.

న‌డిరోడ్డు మీద చంపేసిన హ‌త్య వెనుక అస‌లు క‌థ‌

By:  Tupaki Desk   |   26 May 2017 8:13 AM GMT
న‌డిరోడ్డు మీద చంపేసిన హ‌త్య వెనుక అస‌లు క‌థ‌
X
రెండు తెలుగు రాష్ట్రాల్ని ఉలిక్కిప‌డేలా చేసిన ఘ‌ట‌న క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ప‌ట్ట ప‌గ‌లు అంద‌రూ చూస్తుండ‌గా వేటాడి.. వెంటాడి మ‌రీ న‌రికి చంపిన వైనం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ దృశ్యాల్ని ప‌లువురు చూస్తూ.. వీడియోలు తీయ‌గా.. మ‌రికొంద‌రు త‌మ‌కెందుకులే అన్న‌ట్లుగా వెళ్లారే త‌ప్పించి.. ఆపే సాహ‌సం ఎవ‌రూ చేయ‌లేదు. ఇంత‌కీ.. ఇంత దారుణంగా హ‌త్య ఎందుకు జ‌రిగింది. కొబ్బ‌రి బొండాలు కొట్టే క‌త్తిని తీసుకొని.. ప‌ద‌కొండుసార్లు అదే ప‌నిగా ఎందుకు న‌రికి చంపారు? అనంత‌రం తాపీగా వెళ్లిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయిన వైనం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు రోడ్డులో చోటు చేసుకున్న ఈ హ‌త్య‌ను తొలుత ఫ్యాక్ష‌న్ హ‌త్య‌గా భావించిన‌ప్ప‌టికీ.. పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఈ హ‌త్య వెనుక వివాహేత‌ర సంబంధానికి సంబంధించిన వివాదం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించారు. ఈ హ‌త్య‌కు దారి తీసిన ప‌రిస్థితులు చూస్తే..

హ‌త్య‌కు గురైన వ్య‌క్తి పేరు బోరెడ్డి మారుతీరెడ్డి. ఇత‌నిది జ‌మ్మ‌ల‌మ‌డుగు మండ‌లం దేవ‌గుడి. ఇక‌.. ఇత‌డ్ని దారుణంగా చంపేసింది ర‌ఘువీరారెడ్డి.. శ్రీనివాసులు రెడ్డి. వీరిద్ద‌రూ అన్న‌ద‌మ్ములు. మారుతిరెడ్డికి.. వీరికి మ‌ధ్య ఉన్న వివాదం ఏమిట‌న్న‌ది చూస్తే.. హ‌తుడి సోద‌రి వ్య‌వ‌హారంలోకి వెళ్లాల్సి ఉంటుంది. మారుతిరెడ్డి సోద‌రి ప్రొద్దుటూరులో అంగ‌న్ వాడీ టీచ‌ర్‌గా ప‌ని చేస్తోంది. ఆమెకు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అనే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం ఉంది. అయితే.. ఈ వ్య‌వ‌హారాన్ని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి నిర్మ‌ల అస్స‌లు స‌హించ‌లేక‌పోయింది. త‌న కొడుకును తీసుకొని మారుతి రెడ్డి సోద‌రి ఇంటికి వెళ్లి.. వివాహేత‌ర సంబంధాన్ని తుంచుకోవాల్సిందిగా హెచ్చ‌రించింది. దీంతో.. త‌న అక్క‌ను ఇంటికి వ‌చ్చి బెదిరిస్తారా? అంటూ మారుతి రెడ్డి మండిప‌డుతూ.. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఇంటికి వెళ్లి నిర్మ‌ల‌తో గొడ‌వ‌కు దిగాడు.

దీనిపై నిర్మ‌ల పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టం.. మారుతీరెడ్డి అరెస్ట్ కావ‌టం జ‌రిగింది. అనంత‌రం బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఇదంతా 2014లో జ‌రిగింది.

నిర్మ‌ల సోద‌రులైన ర‌ఘువీరారెడ్డి.. శ్రీనివాసులు రెడ్డి (హ‌త్య చేసిన వారు) ల‌కు బ‌య‌ట‌ప‌డి సింగ‌పూర్ వెళ్లిపోయాడు మారుతీరెడ్డి. త‌న‌పై న‌మోదైన కేసుకు సంబంధించి కోర్టు విచార‌ణ ఉండ‌టంతో మారుతీరెడ్డి ప్రొద్దుటూరుకు వ‌చ్చాడు. కోర్టుకు వెళ్లే స‌మ‌యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింద‌న్న‌ది స‌మాచారం. నిర్మ‌ల సోద‌రులు ఇద్ద‌రూ మారుతీరెడ్డి మీద దాడికి దిగ‌టం.. వారికి భ‌య‌ప‌డి ప‌రుగులు తీస్తున్న మారుతీరెడ్డిని ప‌ట్టుకొని.. కొబ్బ‌రికాయ‌లు కొట్టే క‌త్తిలో ఒక‌రు అదే ప‌నిగా న‌ర‌క‌గా.. మ‌రొక‌రు క‌ద‌ల‌కుండా పట్టుకున్న వైనం.. అక్క‌డి వారు తీసిన వీడియోతో బ‌య‌ట‌కు వచ్చింది . క‌త్తిపోట్ల‌కు గురై.. చ‌ల‌నం లేకుండా ప‌డిపోయిన‌ప్ప‌టికీ.. అదే ప‌నిగా న‌ర‌క‌టం ప‌లువురికి దిగ్భాంత్రికి గురి చేసింది. హ‌త్య అనంత‌రం తాపీగా న‌డుచుకుంటూ వెళ్లిన నిందితులు.. పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/