Begin typing your search above and press return to search.

ఆ మాజీ సీఎంను అడ్డుకుంటున్నది ఎవరు?

By:  Tupaki Desk   |   14 Dec 2016 5:17 PM IST
ఆ మాజీ సీఎంను అడ్డుకుంటున్నది ఎవరు?
X
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఏపీకి చిట్టచివరి సీఎం. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాల్లో లేరు. అయితే... కొన్నాళ్లుగా ఆయన మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. అయితే... చాలాకాలంగా ఆ మాట వినిపిస్తున్నా ఆయన చేరిక మాత్రం కనిపించడం లేదు. అందుకు కారణం.. కాంగ్రెస్ లోని కొందరు నేతలు మోకాలడ్డడమే అని తెలుస్తోంది.

కిరణ్‌ కుమార్‌ చిత్తూరు జిల్లాకు చెందిన వారే కానీ.. నెల్లూరు అల్లుడు. అందుకే నెల్లూరోళ్లకు కిరణ్‌ అంటే అదో రకమైన అభిమానం. నెల్లూరులోనూ ఆయనకు కొంత క్యాడర్ ఉంది. మొన్నామధ్య పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్ని జిల్లాలు తిరుగుతూ నెల్లూరుకు వచ్చారు. ఆ సమయంలో ఎప్పటి నుంచో నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అందరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేశారు. అదే రోజు గతంలో సమైక్యాంధ్ర పార్టీలో పని చేసిన ఒకరిద్దరు నేతలు కాంగ్రెస్‌ పార్టీ కండువాలు వేసుకున్నారు. దాంతో నెల్లూరులో కిరణ్‌ కుమార్‌ రెడ్డి పునరాగమనంపై చర్చ మొదలయ్యింది. కాంగ్రెస్‌ లో చేరిన సమైక్యాంధ్ర నేత ఒకరు కిరణ్‌ రెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్‌ లోకి రానున్నారని ప్రకటించడం ఇందుకు ఊతమిచ్చింది.

అయితే... కాంగ్రెస్ ను అందరూ వీడి వెళ్లినా ఒంటరిపోరాటం చేస్తున్న ప్రస్తుత పీసీసీ చీఫ్ రఘువీరా భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు సీఎం పదవి ఖాయమని నమ్ముతున్నారట. ఆ నేపథ్యంలో కిరణ్ వంటివారు వస్తే తనకు అవకాశాలు తగ్గుతాయని ఆయన వర్గం భావిస్తోందన్న ప్రచారం ఒకటుంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో అధిష్ఠానంతో తీవ్రంగా విభేదించిన కిరణ్ను మళ్లీ ఎలా చేర్చుకుంటారన్న వాదన ఒకటి అధిష్ఠానం ముందు కొందరు వినిపించారని తెలుస్తోంది. దాని వెనుక రఘువీరా ఉన్నారని చెబుతున్నారు. అయితే.. కాంగ్రెస్ లోనే రఘువీరా వ్యతిరేక వర్గం మాత్రం కిరణ్ ను పార్టీలోకి తేవాలని తెగ ట్రయ్ చేస్తోందట. చివరకు ఏమవుతుందో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/