Begin typing your search above and press return to search.

ఏపీ లో ఉద్యోగులకు జీతాలు అందలేదా?

By:  Tupaki Desk   |   2 Aug 2019 6:08 AM GMT
ఏపీ లో ఉద్యోగులకు జీతాలు అందలేదా?
X
ప్రభుత్వ ఉద్యోగమంటే ఠంచనుగా 1వ తారీఖునే జీతాలు పడుతాయి. అబ్బో వారికేంట్రా గవర్నమెంట్ ఉద్యోగం అని అందరూ ముక్కున వేలేసుకుంటారు. కానీ ఈసారి ఏపీ ఉద్యోగులకు జీతాలు అందలేదనే వార్త మీడియాలో హైలెట్ అయ్యింది. నిజంగా పడలేవా? కారణాలేంటి? ఎందుకు పడలేదు..? ఆర్థిక స్థితి బాగాలేదా? ఇలా రకరకాల ప్రశ్నలు చుట్టుముట్టాయి.

ఏపీ ఉద్యోగులకు జీతాలు పడలేదనే వార్త ప్రచారంలోకి వచ్చాక ఏపీ ఆర్థిక స్థితి గురించి, నవరత్నాలు, లోటు బడ్జెట్ పై అందరూ విమర్శలు మొదలు పెట్టారు. అయితే తాజాగా తేలిన విషయం ఏంటంటే ఏపీ ఉద్యోగులకు జీతాలు పడకపోవడానికి కారణం కేంద్రప్రభుత్వానికి చెందిన ఇ-కుబేరాలో కొన్ని సాంకేతిక సమస్యలే కారణమని తేలింది. ఫలితంగానే బిల్లుల తుది విడుత చెల్లింపుల్లో జాప్యం జరిగిందని సమాచారం.

కొన్ని సామాజిక మాద్యమాలలో, టీవీలలో ప్రసారమవుతున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజు జీతాలు చెల్లించలేకపోవటానికి నిధుల కొరత కారణం కాదని ఏపీ ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది..

సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఇ-కుబేర్’ ద్వారా ఈ చెల్లింపులు జరుగుతాయి. అదే ప్రకారం అన్ని జిల్లాల పింఛన్లు, జీతాలు ఫైళ్లు యధాప్రకారం జులై 31 నే ఆర్బీఐకి ఏపీ ఆర్థిక శాఖ పంపింది..

1వ తేదీ మధ్యానానికి పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల ఫైళ్లు చెల్లించారని తెలిపింది.. ఆ తరువాత సాంకేతిక కారణాల వల్ల ఇ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పనిచేయకపోవటం మూలంగా మిగిలిన ఫైళ్లు చెల్లింపు ఆలస్యం అయ్యిందని వివరణ ఇచ్చారు..

ఆర్బీఐ వెంటనే సమస్యని వెంటనే పరిష్కరించింది. తొలగిన సాంకేతిక సమస్యతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించారని సమాచారం.