Begin typing your search above and press return to search.

సెక్యుల‌ర్ క‌ల‌ల‌కు త‌లాక్ షాక్‌

By:  Tupaki Desk   |   23 Aug 2017 10:46 AM IST
సెక్యుల‌ర్ క‌ల‌ల‌కు త‌లాక్ షాక్‌
X
పేరుకు సెక్యుల‌ర్ పార్టీలుగా చెప్పుకుంటూ.. ఏ మాత్రం లౌకిక విధానాల్ని అనుస‌రించే పార్టీల‌కు దిమ్మ తిరిగే షాక్ త‌లాక్ రూపంలో వ‌చ్చింద‌ని చెప్పాలి. ముస్లిం మ‌హిళ‌ల ఆకాంక్ష‌ల్ని గుర్తించ‌టంలో లౌకిక పార్టీలుగా చెప్పుకునే రాజ‌కీయ ప‌క్షాల‌కు ఇప్పుడు త్వ‌త్త్వం బోధ ప‌డి విల‌విల‌లాడుతున్న ప‌రిస్థితి.

హిందుత్వ బ్రాండ్ తో రాజ‌కీయ అంట‌రానిత‌నాన్ని బీజేపీకి ఆపాదించిన రాజ‌కీయ పార్టీల‌కు తాజా ప‌రిణామం ఏ మాత్రం జీర్ణించుకోలేని ప‌రిస్థిగా మారింది. ముస్లిం మ‌హిళ‌లు పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న ట్రిపుల్ త‌లాక్ పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇవ్వ‌టం.. ఆర్నెల్ల కాల‌వ్య‌వ‌ధిలో ఈ వ్య‌వ‌హారం మీద చ‌ట్టం చేయాల‌ని కోర‌టంపై క‌మ‌ల‌నాథుల ఆనందానికి హ‌ద్దుల్లేకుండా పోతే.. లౌకిక పార్టీలుగా చెప్పుకునే రాజ‌కీయ ప‌క్షాల నోట మాట రాని ప‌రిస్థితి. తాజా ప‌రిణామంతో 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి దూరంగా ఉంటాయ‌ని చెప్పే మైనార్టీలు సైతం.. త‌మ‌కే ఓట్లు వేయ‌టం ఖాయ‌మ‌న్న మాట బీజేపీ నేత‌ల నోట వినిపిస్తోంది.

త‌మ‌కు శాపంగా మారిన ట్రిపుల్ త‌లాక్ విధానాన్ని పోయేలా చేసిన బీజేపీ ప‌ట్ల ముస్లిం మ‌హిళ‌లు అభిమానించ‌టం ఖాయ‌మ‌ని.. ఇందుకు కార‌ణ‌మైన మోడీ స‌ర్కారుకు అనుకూలంగా ఓట్లు వేస్తార‌న్న అంచ‌నాలు పెరుగుతున్నాయి. త‌ర‌త‌రాలుగా త‌మ‌ను వెంటాడుతున్న శాపాన్ని వీడిపోయేలా చేయ‌టంలో మోడీ స‌ర్కారు పోషించిన కీల‌క‌భూమిక‌ను ముస్లిం మ‌హిళ‌లు గుర్తుంచుకోవ‌టం ఖాయ‌మ‌ని.. ఎన్నిక‌ల వేళ‌.. త‌మ‌కు చేసిన మేలుకు ఓట్ల‌తో బ‌దులు తీర్చుకోవ‌టం ఖాయ‌మంటున్నారు.

ఇదే జ‌రిగితే.. సెక్యుల‌ర్ జపం వ‌ల్లిస్తూ.. వ్యూహాత్మ‌క ఓటుబ్యాంకు రాజ‌కీయాలు న‌డిపే రాజ‌కీయ పార్టీల‌కు తాజా ప‌రిణామం కోలుకోలేని దెబ్బ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. సెక్యుల‌ర్ క‌బుర్లు చెప్పి.. త‌మ హ‌క్కుల్ని.. త‌మ ఆవేద‌న‌ను ప‌ట్టించుకోని రాజ‌కీయ పార్టీల‌కు ముస్లిం మ‌హిళ‌లు త‌మ ఓట్ల‌తో త‌గిన బుద్ధి చెప్పే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. రాజ‌కీయ పార్టీల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిజానికి యూపీకి జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌లుచోట్ల ముస్లిం మ‌హిళ‌లు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేశార‌న్న వాద‌న ఉన్న విష‌యం తెలిసిందే. ట్రిపుల్ త‌లాక్ మీద మోడీ స‌ర్కారు పోరాడుతున్న వైనానికి త‌మ మ‌ద్ద‌తు ఉంద‌న్న విష‌యాన్ని వారు త‌మ ఓట్ల‌తో చెప్పార‌ని.. ఈ కార‌ణంతోనే ఆ ఎన్నిక‌ల్లో బీజేపీకి అంత భారీ మెజార్టీ ల‌భించింద‌న్న మాట వినిపిస్తోంది.

ట్రిపుల్ త‌లాక్ తో ముస్లిం మ‌హిళ‌ల మ‌న‌సు గెలుచుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న చేసిన బీజేపీ.. అందులో భాగంగా తొలుత ఈ దురాచారంపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌ను షురూ చేసింది. ఇంత‌కాలం త‌మ‌కు అనుకూలంగాఏ రాజ‌కీయ శ‌క్తి కూడా నోరు విప్ప‌ని నేప‌థ్యంలో త‌మ మ‌న‌సుల్లోనే అంతులేని ఆవేద‌న‌ను ముస్లిం మ‌హిళ‌లు దాచుకున్నారు. ఎప్పుడైతే బ‌ల‌మైన రాజ‌కీయ ప‌క్షం ముస్లిం మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పి.. న్యాయ‌పోరాటాన్ని షురూ చేసిందో.. బాహాటంగా కొంద‌రు.. మౌనంగా మ‌రికొంద‌రు త‌మ మ‌ద్ద‌తును ప‌లు రూపాల్లో వ్య‌క్తం చేశారు. ట్రిపుల్ త‌లాక్ కు వ్య‌తిరేకంగా తాము చేస్తున్న పోరాటంపై ముస్లిం మ‌హిళ‌లు సానుకూలంగా స్పందిస్తున్నార‌న్న విష‌యాన్ని క‌మ‌ల‌నాథులు తొలుతే గుర్తిస్తే.. ఆ విష‌యాన్ని సెక్యుల‌ర్ పార్టీలుగా చెప్పుకునే రాజ‌కీయ ప‌క్షాలు గుర్తించేస‌రికి జ‌ర‌గాల్సింది జ‌రిగిపోయిందంటున్నారు. ఏమైనా సెక్యుల‌ర్ పార్టీలుగా త‌మ‌ను తాము అభివ‌ర్ణించే పార్టీల‌కు ట్రిపుల్ త‌లాక్ కోలుకోలేని దెబ్బ తీసింద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.