Begin typing your search above and press return to search.

డబ్బుల విమానాలు ఏపీకి వచ్చేశాయోచ్

By:  Tupaki Desk   |   2 Dec 2016 10:57 AM IST
డబ్బుల విమానాలు ఏపీకి వచ్చేశాయోచ్
X
నెల ప్రారంభంలో జీతాలు బ్యాంకుల్లో పడినా.. వాటిని చేతుల్లోకి తీసుకోవటానికి అవకాశం లేని పరిస్థితి ఏపీలో చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా కరెన్సీ నోట్ల కొరత ఉన్నప్పటికీ ఏపీలో అంతకు మించిన ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న చిల్లర కష్టాలు తీర్చటానికి రూ.500 నోట్లను పంపితే.. అందులో ముద్రణా లోపాలు ఉండటంతో వాటిని వెనక్కి పంపేయటం.. ఆ తర్వాత నగదు రాకపోవటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు.

నెల మొదలై.. అవసరాలు భారీగా ఉన్న వేళ.. చేతిలో కరెన్సీ నోటు లేక ప్రజలు పడుతున్న తిప్పలు అన్నిఇన్ని కావు. ఏపీలో నెలకొన్న కరెన్సీ నోట్ల కష్టాల్ని తీర్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. తనకున్న వ్యక్తిగత పరపతిని ఉపయోగించి.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చి.. ఏపీకి కరెన్సీ నోట్లు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

నిరంతర ఫాలో అప్ తో కరెన్సీ కష్టాలు తీర్చేందుకు వీలుగా భారీగానోట్లను ఆర్ బీఐ నుంచి తెప్పించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. తాజాగా రూ.2500 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను ఏపీకి ప్రత్యేకంగా చేరవేశారు. యుద్దప్రాతిపదికన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విమానాల ద్వారా తెప్పించిన ఈ నగదును.. అంతే వేగంగా ఏపీ వ్యాప్తంగాఉన్న పలు విమానాశ్రయాలకు పంపుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరెన్సీ కొరతను ఒక కొలిక్కి తీసుకు రావటంతోపాటు.. ఈ రోజు సాయంత్రానికి (శుక్రవారం) నగదు కొరత కొంతమేర అయినా తీరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో టైం గురించి పట్టించుకోకుండా.. ప్రజలకు నగదు కొరత లేకుండా చూడాలని ఆయన కోరుతున్నారు. డబ్బులు తీసుకొచ్చిన విమానాల రాకతో ఏపీ కరెన్సీకష్టాలు కొంతమేర అయినా తీరుతాయనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/