Begin typing your search above and press return to search.

సుష్మాస్వరాజ్‌కు ఎంపీ రాయపాటి కిడ్నీ?

By:  Tupaki Desk   |   18 Nov 2016 1:20 PM
సుష్మాస్వరాజ్‌కు ఎంపీ రాయపాటి కిడ్నీ?
X
రెండు మూత్రపిండాలు విఫలమై ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు తన కిడ్నీ ఇచ్చేందుకు సీనియర్ లీడర్ - టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన తన సమ్మతి తెలియజేస్తూ సుష్మ కార్యాలయంలో లేఖ ఇచ్చారు. సుష్మకు కిడ్నీ ఇచ్చేందుకు తాను సిద్ధమని... తన కిడ్నీని స్వీకరించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు.

కాగా నిన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా సుష్మకు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ట్విట్టర్ లోనూ ఆమె అభిమానులు కొందరు ముందుకొచ్చినా అవేమీ ఆమెకు సూటవలేదు. దీంతో ఆమె కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స వాయిదా పడుతోంది.

తాజాగా రాయపాటి కూడా అంగీకారం తెలపడంతో ఆయన కిడ్నీ సూటవుతుందో లేదో పరీక్షించే అవకాశముంది. సుష్మాస్వరాజ్ లాంటి నేత‌ దేశ‌ రాజకీయాల్లో ఉండ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌ని, అంతేగాక ఆమె త‌న‌కు చిర‌కాల మిత్రురాల‌ని రాయపాటి సాంబశివరావు మీడియాకు తెలిపారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి ప్రత్యర్థిగా పార్లమెంటులో వ్యవహరించిన రాయపాటి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి బీజేపీకి మిత్రుడయ్యారు. సీనియర్ పార్లమెంటేరియన్ అయిన రాయపాటికి అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలుండడం.. సుష్మ కూడా కాంగ్రెస్ నేతలకూ మంచి మిత్రురాలు కావడంతో ఆమెకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన రాయపాటి కిడ్నీ దానానికి ముందుకొచ్చారు. మరి సుష్మ అంగీకరిస్తారో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/