Begin typing your search above and press return to search.

ఇంటింటికీ `రేష‌న్` ప‌రేషాన్‌.. రీజ‌నేంటి!

By:  Tupaki Desk   |   8 March 2021 2:11 PM IST
ఇంటింటికీ `రేష‌న్` ప‌రేషాన్‌.. రీజ‌నేంటి!
X
ఏపీలో ప్రారంభించిన అత్యంత కీల‌క‌మైన ప‌థ‌కం.. `రేష‌న్ డోర్ డెలివ‌రీ` స‌మ‌స్య‌ల‌కు కేరాఫ్‌గా మారిపో యింది. సీఎం జ‌గ‌న్ ఎంతో ముందు చూపుతో.. ల‌బ్ధిదారులు రేష‌న్ దుకాణాల చుట్టూ తిర‌గ‌కుండా.. వారివిలువైన స‌మ‌యం వృధా కాకుండా... ఇంటి ముందుకే రేష‌న్ అందించాల‌నే బృహ‌త్త‌ర ల‌క్ష్యంతో దీనిని తీసుకున్నారు. దీనికిగాను దాదాపు 3500 కోట్ల రూపాయ‌లు వెచ్చించారు.. ల‌క్ష్యం మంచిదే అయినా.. పేద‌ల‌కు, ముఖ్యంగా కూలి ప‌నులు చేసుకునే వారికి ఇది ఎంతో సౌల‌భ్యంగా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో దీనిని అమ‌లు చేయాల్సిన అధికార గ‌ణం..నిర్లిప్త‌త‌.. నిర్ల‌క్ష్యం కార‌ణంగా.. ప‌థ‌కానికి అనేక స‌మ‌స్య‌లు ఎదురవుతున్నాయి.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు రేష‌న్ డీల‌ర్లు షాపులు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి నెలా 1వ తారీకునే షాపుల్లో రేష‌న్ పంపిణీ చేస్తున్నారు. అయితే.. ల‌బ్ధిదారులు రేష‌న్ దుకాణాలకు వెళ్లి క్యూలైన్ల‌లో వేచి ఉండేందుకు క‌నీసం రెండు నుంచి మూడు గంట‌ల స‌మ‌యం వెచ్చించాల్సి వ‌స్తోంది. ఫ‌లితంగా ప‌నులు నిలిచిపో‌తున్నాయి.పైగా ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి వెంటాడుతున్న నేప‌థ్యంలో రేష‌న్ దుకాణాల‌కు వ‌చ్చేందుకు వృద్ధులు, గ‌ర్భిణులు, మ‌హిళ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.. ఈ స‌మ‌స్య‌ల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని కీల‌క‌మైన ప్రాజెక్టుగా దీనిని తీసుకువ‌చ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఇంటికే రేష‌న్ పంపిణీ చేస్తానంటూ.. దాదాపు 9 వేల వాహ‌నాల‌ను కొనుగోలు చేశారు.

వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన యువ‌త‌కు అప్ప‌గించారు. అయితే.. వ్య‌వ‌స్థ మంచిదే అయినా.. అమ‌లు చేసేవారు స‌రైన నిర్దిష్ట‌త‌ల‌ను పాటించ‌ని కార‌ణంగా.. ఇబ్బందులు త‌లెత్తి.. సీఎం జ‌గ‌న్ లక్ష్యానికి గండి కొట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. ``అయ్యా.. నెల గ‌డిచిపోయింది.. ఇప్ప‌టి వ‌ర‌కు బియ్యం అంద‌లేదు` అని చెప్పే వారు ఇటు న‌గ‌రాల్లోను, అటు ప‌ట్ట‌ణాల్లోనూ పెరిగిపోతున్నారు. గ‌త ఫిబ్ర‌వ‌రి మాసానికి సంబంధించిన రేష‌న్ డోర్ డెలివ‌రీఅంచ‌నాల‌ను తీసుకుంటే.. అధికారులు చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం 78 శాతం మాత్రం ల‌బ్ధి దారుల‌కు రేష‌న్ పంపిణీ చేశారు. అది కూడా నెల మొత్తం సాగుతూనే ఉంది.

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. రేష‌న్ వాహ‌నాలు ఎప్పుడు వ‌స్తాయో.. ఎప్పుడు త‌మ‌కు బియ్యం ఇస్తారో.. అని ల‌బ్ధి దారులు రోజుల త‌ర‌బ‌డి క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. క్షేత్ర‌స్థాయిలో.. చిన్నపాటి రోడ్లు, కొండ ప్రాంతాల్లోని వారు.. ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక‌, వాహ‌న దారులు కూడా బియ్యం మూట‌ల‌ను మోయ‌లేమ‌ని.. త‌మ‌కు వేత‌నాలు స‌రిపోవ‌ని.. ఆందోళ‌న‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. వెర‌సి మొత్తంగా ఈ ప‌థ‌కం ల‌క్ష్యం మంచిదే అయినా.. అమ‌లు చేయాల్సిన అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం, స‌రైన మానిట‌రింగ్ చేయ‌లేక పోవ‌డం కార‌ణంగా దేశంలోనే తొలిసారి ప్రారంభించిన ఈ ప‌థ‌కం ఇప్పుడు స‌మ‌స్య‌ల‌కు ఆల‌వాలంగా మారిపోయింద‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.