Begin typing your search above and press return to search.

రేషన్ కార్డుపై యేసు.. టీడీపీ కుట్ర బట్టబయలు

By:  Tupaki Desk   |   10 Dec 2019 4:42 AM GMT
రేషన్ కార్డుపై యేసు.. టీడీపీ కుట్ర బట్టబయలు
X
బోడిగుండికి మోకాలికి ముడి పెడుతున్నారు. పేదలకు ఉచితంగా పంచే రేషన్ సరుకులకు.. తినే తిండికి కూడా మతమౌఢ్యాన్ని అంటగడుతున్నారు. ఏపీ సీఎంగా జగన్ గద్దెనెక్కాక సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పుతూ ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలకు పంచిపెడుతున్నారు. ఈ క్రమంలో పాలనలో ఎలాంటి లోపాలు కనిపించడం లేదు. దీంతో జగన్ ను దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా ఆయన ప్రత్యర్థులు మతం రంగును వైసీపీపై రుద్దుతున్నారని తేటతెల్లమవుతోంది.

జగన్ మతాన్ని అడ్డం పెట్టుకొని ఏపీలోని అధికార వైసీపీని దెబ్బకొట్టే కుట్ర జరుగుతోంది. ఏపీ సీఎంగా జగన్ అయినప్పటి నుంచి క్రైస్తవ మత మార్పిడికి మద్దతుగా పాలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీని అపఖ్యాతి చేసేందుకే ఇప్పటికే చాలా ఉందంతాలను బయటకు తెచ్చి మతం రంగు పులుముతున్న దారుణం కొనసాగుతోంది.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దపురం మండలం వడ్లమూడులోని ఓ రేషన్ షాపులో రేషన్ కార్డుమీద యేసు క్రీస్తు బొమ్మ ఉండడం కలకలం రేపింది. దీనిపై టీడీపీ, పచ్చ మీడియా చిలువలు పలువలు చేసి రాద్ధాంతం చేస్తోంది. ఏపీ ప్రజలను ఇలా మత మార్పిడిలకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందంటూ పరుష ఆరోపణలు చేస్తోంది.

అయితే దీనిపై వైసీపీ సర్కారు సీరియస్ అయ్యి విచారణ జరిపింది. రేషన్ షాపు నిర్వహిస్తున్న డీలర్ పేరు మంగదేవి. ఈమె స్వయంగా టీడీపీ నాయకుడి భార్య. టీడీపీ వాళ్లదే ఈ రేషన్ షాపు. వీరు ప్రతి సంవత్సరం రేషన్ కార్డులపై దేవుడి బొమ్మలను ముద్రిస్తుంటారు. 2016లో సాయిబాబాను, 2017లో వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని ముద్రించారు. ఈ సంవత్సరం యేసు క్రీస్తు బొమ్మను యథాలాపంగా ముద్రించారు. ఏపీలో వైసీపీ సర్కారు ఉండడం తో కొందరు టీడీపీ నేతల ప్రోద్బలం తో ఉద్దేశ పూర్వకంగానే యేసు క్రీస్తు బొమ్మను ముద్రించారని తేలింది.

రేషన్ సరుకుల కార్డు పై యేసు క్రీస్తు బొమ్మ ఉండడం వైరల్ అయ్యింది. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ఏపీలో అన్యమత ప్రచారంపై సీరియస్ గా ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో మరింత సెగ తగిలేలా వైసీపీ-బీజేపీలు దూరం జరిగేలా టీడీపీ మీడియా దీన్ని రచ్చ చేసింది.

అయితే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలే ఇలా వైసీపీ సర్కారు పై మత ముద్ర వేస్తున్న వైనం తాజాగా రేషన్ కార్డులపై యేసు బొమ్మతో తేటతెల్లమైంది. గతంలో తిరుమల బస్సు టికెట్లపై కూడా టీడీపీ హయాంలోనే అన్యమత ప్రచారం ప్రకటనలు ముద్రించారు. ఆ నెపాన్ని వైసీపీ ప్రభుత్వంపై నెట్టారు. ఇప్పుడు కావాలనే రేషన్ కార్డులపై టీడీపీ నేతలు యేసు బొమ్మ పెట్టారు. ఇలా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర బట్టబయలు అయ్యింది. వైసీపీ సర్కారును అభాసుపాలు చేసేందుకు కుట్రపన్నిన సదురు రేషన్ డీలర్ పై చర్యలకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది. టీడీపీ చేస్తున్న ఈ కుట్రలను ఛేధించడానికి సిద్ధమైంది.