Begin typing your search above and press return to search.

కలెక్టర్ ను గులాబీ ఎమ్మెల్యే ఏయ్ అంటే..

By:  Tupaki Desk   |   2 March 2017 7:02 AM GMT
కలెక్టర్ ను గులాబీ ఎమ్మెల్యే ఏయ్ అంటే..
X
ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు తప్పు చేసినా.. సమయం సందర్భం చూసుకోవాలే తప్పించి.. తొందరపడకూడదు. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. దూకుడు రాజకీయాలు మొదలైన నేపథ్యంలో.. మారిన కాలానికి తగ్గట్లే బ్యూరోక్రాట్లలో కూడా దూకుడుతనం పెరిగిందా? హద్దులు దాటే అసహనం వారిని కూడా ఆవహించేసిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనను చూస్తే.. మారిన మర్యాదలు ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనను చూస్తే.. ఆగ్రహంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోట మాట తూటా మాదిరిగా వస్తే.. అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో కలెక్టర్ బదులిచ్చిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఈ లొల్లేంది?అన్న ప్రశ్నవేసుకునే పరిస్థితి. అధికారపార్టీ నేతలకు.. అధికారులకు మధ్య ఉండే సంబంధాలకు భిన్నంగా తాజా ఉదంతం చోటు చేసుకోవటం గమనార్హం.

డిజి ధనమేళా కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని.. ముఖ్యమంత్రి.. కేంద్రమంత్రి.. రాష్ట్రమంత్రుల ఫోటోల్ని మాత్రమే ముద్రించారు. ఎంపీ వినోద్ కుమార్.. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు.. ఎమ్మెల్యేలు బాలకిషన్.. గంగుల కమలాకర్ ఫోటోల్ని ముద్రించకపోవటంపై నేతలు ఆగ్రహం చెందారు.

వేదిక మీదున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఉద్దేశించిన ఎమ్మెల్యే బాలకిషన్.. అధికారులు ప్రోట్రోకాల్ పాటించకపోవటం ఏమిటని ప్రశ్నిస్తూ.. ఫ్లెక్సీ మీద ఫోటోలు లేకపోవటం ఏమిటంటూ నిలదీశారు. ఈ సందర్భంగా.. ‘‘ఏయ్ కలెక్టర్.. ఏమిటిది?’’ అంటూ ఆవేశంగా ప్రశ్నించగా.. అందుకు బదులిచ్చే క్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ ‘డోంట్ టాక్’ అంటూ గద్దించిన వైనం ఇప్పుడు హాట్ హాట్ చర్చగా మారింది.

ఈ ఎపిసోడ్ ను పరిశీలిస్తే.. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ.. ఎమ్మెల్యేల ఫోటోలు అచ్చేయించాల్సి ఉందని చెబుతున్నారు. మరి.. అలా ఎందుకు జరగలేదన్నది ఒక ప్రశ్న. అలాంటి తప్పులు జరిగినప్పుడు అధికారులు వివరణ ఇవ్వాల్సింది పోయి.. మాటకు మాట అన్నట్లుగా మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది.

అధికారపక్ష ఎమ్మెల్యేకు.. కలెక్టర్ కు మధ్య అంతకంతకూ ముదురుతున్న వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నంలో ఆర్థికమంత్రి ఈటెల జోక్యం చేసుకోవటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గటం కనిపించింది. ఇదిలా ఉంటే.. డిజి ధన్ మేళా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఏర్పాటు చేశామని.. ప్రోటో కాల్ కూడా వారి సూచనల మేరకే పాటించినట్లుగా కలెక్టర్ చెబుతున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే.. వివాదాలు తలెత్తే అవకాశం ఇవ్వకుండా.. ముందుస్తుగా సమాచారం అందించటం.. మారిన ప్రోటోకాల్ వైనాన్నివివరిస్తే ఇంత రచ్చ చోటు చేసుకునేది కాదుగా అన్న మాట అధికారపక్షంలో వినిపిస్తోంది.

మరోవైపు.. ఇదే విషయంపై అధికారుల వాదన మరోలా ఉంది. నిజంగానే అధికారులు తప్పు చేస్తే.. వారిని నలుగురి ముందు అవమానించేలా మాట్లాడటం కన్నా.. తర్వాత ప్రోసీజర్ ప్రకారం చర్యలు తీసుకోవటమో.. వివరణ కోరటమో చేయొచ్చు కదా? ఇలా మాట అనేయటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా.. హుందాగా వ్యవహరించాల్సి వారు.. అందుకు భిన్నంగా వ్యవహరించటం మాత్రం కాస్త జీర్ణించుకునేలా లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/