Begin typing your search above and press return to search.

ఇషా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం...!

By:  Tupaki Desk   |   28 Oct 2021 11:30 AM GMT
ఇషా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం...!
X
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం, విద్య, పరిశోధన సంస్థకు చెందిన ప్రతిష్ఠాత్మక స్మిత్‌ సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్ ఏసియన్‌ ఆర్ట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ గా నియామకం అయ్యారు. అతి చిన్న వయసులోనే ఆమె ఈ గౌరవం దక్కించుకున్నారు. ఇషా నియామకానికి అమెరికా చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ జీ రాబర్ట్స్‌ నేతృత్వంలోని స్మిత్‌ సోనియన్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెజెంట్స్‌, ఎక్స్‌ అఫీషియో సభ్యురాలైన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ఆమోద ముద్ర వేశారు.

2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. మ్యూజియంలోని విలువైన వస్తువులు, కలెక్షన్స్‌ మరింత మందికి చేరువయ్యేందుకు, భారతీయ, ఆసియా కళలు, సంస్కృతులను అందరూ ఉన్నతంగా అర్థం చేసుకొనేందుకు ఇషా దార్శనికత, అంకితభావం, అభిరుచి ఉపయోగపడతాయని స్మిత్‌ సోనియన్స్‌ తెలిపింది. త్వరలోనే ఈ ప్రఖ్యాత మ్యూజియం శతాబ్ది వేడుకలకు ముస్తాబవ్వనుంది. ఇప్పుడు ఎంపికైన బోర్డు సభ్యులంతా ఈ ఉత్సవాన్సి ఘనంగా జరిపేందుకు కృషి చేయనున్నారు.

ఇషా అంబానీ ముంబయిలోని ధీరూభాయ్‌ అంబానీ అంతర్జాతీయ పాఠశాలలో చదివారు. ఆ తర్వాత అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీ, స్టాన్‌ ఫర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొన్నాళ్లు అమెరికాలోనే ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేశారు. భారత్‌ కు వచ్చాక రిలయన్స్ జియో స్థాపనలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె జియోలో బోర్డు ఆఫ్ డైరెక్టర్‌ గా ఉన్నారు. అమెరికాలో వాషింగ్టన్‌ డీసీలో ఉన్న స్మిత్‌ సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌లో అనేక అద్భుత కళాఖండాలు ఉన్నాయి. ఇందులో ఇండియా, మెసపోటనియా, జపాన్‌, చైనాలకు చెందిన 45,000లకు పైగా చారిత్రక చిత్రాలు, శిల్పాలు ఇక్కడ ఉన్నాయి.