Begin typing your search above and press return to search.

జగన్ దెబ్బ.. కడపలో టీడీపీకి కోలుకోలేని షాక్

By:  Tupaki Desk   |   9 March 2020 5:57 AM GMT
జగన్ దెబ్బ.. కడపలో టీడీపీకి కోలుకోలేని షాక్
X
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసకందాయంగా మారింది. ఈ ఎన్నికలకు వలసలు సిద్ధమయ్యాయి. సాధారణంగా స్థానిక ఎన్నికలు అంటే చోట, మోట నాయకులు మాత్రమే పార్టీలు మారుస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలతో బడాబడా నాయకులే పార్టీ మార్పునకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కడప జిల్లాలో ఓ మాజీమంత్రితో పాటు మాజీ ఎంపీ టీడీపీ కి బైబై చెప్పేసి వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంట. దీంతో ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో వైఎస్సార్సీపీకి కొంత బలం వస్తుండగా తెలుగుదేశం పార్టీకి మాత్రం కోలుకోలేని దెబ్బ తగలనుంది. వారంలోపలే ఈ పరిణామం జరిగే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇద్దరు కీలక నాయకులు వారి అనుచరులతో సహా వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారంట. జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న రామసుబ్బారెడ్డి కొంతకాలంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీలోనే చేరుతారనే ప్రచారం సాగింది. అయితే అప్పటి సీఎంగా చంద్రబాబు బుజ్జగించడంతో రామసుబ్బారెడ్డి మెత్తబడ్డారు. అయితే ఇప్పుడు పక్కాగా వైఎస్సార్సీపీలో చేరేందుకు మాత్రం సిద్ధమయ్యారంట.

చిరకాలంగా తనకు ప్రత్యర్థిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడంతో రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ వీడాలని భావించారు. అప్పుడు ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆయన పార్టీ వీడకుండా టీడీపీలో ఉన్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి, కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి పోటీచేయాలని ఒప్పందం కుదింరింది. దీనికి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితులే కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఎమ్మెల్సీ పదవిని ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనాథరెడ్డికి కేటాయించారు.

అయితే పరిణామాలు మారాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రాజధాని బిల్లుల సమయంలో ఆదినారాయణ రెడ్డి సోదరుడు శివనాథరెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్సీపీకి దగ్గరయ్యారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. ఈసమయంలో రామసుబ్బారెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నారు. టీడీపీకీ ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో వైఎస్సార్సీపీలో చేరితే ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు అధికార పార్టీ నుంచి హామీ కూడా వచ్చిందంట. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజులుగా రామసుబ్బారెడ్డి తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన అనుభవం రామసుబ్బారెడ్డికి ఉంది. ఆయనను పార్టీలోకి చేరుకోవడంతో ఆదినారాయణరెడ్డిని దెబ్బతీయాలనేది అధికార పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇక ఈయన తో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ టీడీపీ ని వీడే అవకాశం కనిపిస్తోంది. ఆయనే పాలకొండ్రాయుడు. కడప జిల్లాలో టీడీపీలో ముఖ్య నేతగా ఉండడంతో పాటు బలిజవర్గానికి చెందిన వ్యక్తి అయిన పాలకొండ్రాయుడును కూడా వైఎస్సార్సీపీ వ్యూహం రచించింది. రాయచోటి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, 1984లో రాజంపేట లోక్ సభ స్థానం నుండి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ప్రసాద బాబుకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. తన కుమారుడి భవిష్యత్ కోసం ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారంట. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులగా ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పాలకొండ్రాయుడుతో పాటుగా ఆయన తనయుడిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు చర్చించారని సమాచారం. దక్కిన హామీతోో వారిద్దరూ తమ అనుచరులతో కలిసి త్వరలోనే టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారంట. ఇవే గనుక జరిగితే స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీకి భారీ దెబ్బ తగలనుంది.