Begin typing your search above and press return to search.

తిరుమ‌ల..మ‌రో ప‌ద్మ‌నాభ‌స్వామి దేవాల‌య‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   21 Jun 2018 10:19 AM GMT
తిరుమ‌ల..మ‌రో ప‌ద్మ‌నాభ‌స్వామి దేవాల‌య‌మ‌ట‌!
X
తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు - ప్ర‌భుత్వానికి మ‌ధ్య జ‌రుగుతోన్న వివాదంలో ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేదు. శ్రీ‌వారి పోటులోని నేల‌మాళిగ‌లో ఉన్న నిధుల కోస‌మే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆ త‌వ్వ‌కాలు జ‌రిపార‌ని ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబుతోపాటు మ‌రో `మేడ‌మ్` ఆదేశాల ప్ర‌కారమే ఆ త‌వ్వ‌కాలు జ‌రిపిన‌ట్లు అధికారులు త‌న‌కు తెలిపార‌ని ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో, ఆ మేడ‌మ్ ఎవ‌ర‌న్నది రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దాంతో పాటు శ్రీ‌వారి ఆల‌యంలో ఉన్న నేల‌మాళిగ‌ల గురించి ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో బుధ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ సంద‌ర్భంగా ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమ‌ల‌లో అపార‌మైన నిధినిక్షేపాలు దాగున్నాయ‌ని, వాటిని అప‌హ‌రించేందుకు ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. స్వామి వారి దేవాలయం మొదటి ప్రాకారంలో ఉన్న నేలమాళిగలో విలువైన నిధులు దాగున్నాయ‌ని రమణదీక్షితులు చెప్పారు.

పల్లవులు - చోళులు - రాయ‌లు వంటి ఎందరో చక్రవర్తులు - వారి సామంతరాజులు వెంక‌న్న కు అమూల్యమైన ఆభరణాలను - వ‌జ్ర వైఢూర్యాల‌ను - బంగారాన్నిఇచ్చార‌ని - వాటిని మొదటి ప్రాకారంలో దాచారని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయని ర‌మ‌ణ దీక్షితులు అన్నారు. సుమారు 1000 ఏనుగులు - 30వేల అశ్వాలపై అమూల్యమైన సంపదను రాయల వారు తిరుమ‌ల‌లో ఒక‌చోట నిక్షిప్తం చేశారని తాళ‌ప‌త్ర గ్రంథాల్లో ఉంద‌న్నారు. వెంక‌న్న‌ను వెయ్యి కోట్ల దేవుడని పిలిచేవారని - కాకతీయరాజు ప్రతాపరుద్రుడు స్వామివారికి 18 లక్షల బంగారు మొహరీల‌తో తొమ్మిదిన్నర అడుగుల ఎత్తైన మూలవరులకు నవరత్న కవచం `రత్నాంగిణి` స‌మ‌ర్పించార‌ని చెప్పారు. దాంతోపాటు, 18 లక్షల బంగారు మొహర్లతో(ఒకటి సుమారు 100 గ్రాములు)స్వామి వారికి కనకాభిషేకం చేయించార‌ని - అంతేకాకుండా మ‌రెన్నో అమూల్యమైన నవరత్నాలను - బంగారు విగ్రహాలను మొదటి ప్రాకారంలోని నేలమాళిగలో ఉంచిన‌ట్లు తాళ‌ప‌త్ర గ్రంథాల్లో ఉంద‌న్నారు. ఆ నేలమాళిగ కొలతలు కూడా వాటిలో ఉంద‌ని, అయితే, సామాన్య భక్తులు ప్రవేశించలేని విధంగా దానిని భ‌ద్ర‌ప‌రిచార‌ని పత్రాల్లో ఉంద‌ని అన్నారు.