Begin typing your search above and press return to search.

రాకేష్ ఝ‌న్‌ఝ‌న్ వాలా పంట పండింది.. ఒకే రోజు 375 కోట్లు లాభం

By:  Tupaki Desk   |   12 Oct 2021 5:30 PM GMT
రాకేష్ ఝ‌న్‌ఝ‌న్ వాలా పంట పండింది.. ఒకే రోజు 375 కోట్లు లాభం
X
ఇండియ‌న్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ ఝ‌న్‌ఝ‌న్‌వాలా మ‌రోసారి రికార్డు సృష్టించారు. మంగ‌ళ‌వారం నాటి స్టాక్ మార్కెట్ లో ఆయ‌న లాభాల పంట పండించారు. మొత్తం 4 సెష‌న్ల వ్య‌వ‌ధిలో 375 కోట్ల రూపాయ‌లు సంపాయించారు. రాకేష్ పెట్టుబ‌డులు పెట్టిన న‌జారా టెక్నాల‌జీస్‌, టైటాన్ కంపెనీ, టాటా మోట‌ర్స్ స్టాకులు పుంజుకోవ‌డంతో.. ఝ‌న్‌ఝ‌న్‌వాలాకు సిరి కురిసింది!! ముఖ్యంగా టాటా మోటార్స్ షేర్ విలువ 30శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఊగిసలాటతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ధోరణి కొనసాగించాయి.

చివరి గంటలో కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి ఎగబాకి ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. దేశీయంగా విద్యుత్తు సంక్షోభం రానుందనే భయాల మధ్య సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. అయితే, కరెంట్‌ కోతలకు ఆస్కారం లేదన్న కేంద్రం.. సమస్య పరిష్కారానికి రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీని నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న మదుపర్లు చివరి గంటలో కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మంగ‌ళ‌వారం ఉదయం సెన్సెక్స్‌ 60,045.75 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది.

రోజులో 60,331.74 - 59,885.39 మధ్య కదలాడింది. చివరకు 148.53 పాయింట్ల లాభంతో 60,284.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,008.65 - 17,864.95 మధ్య కదలాడి చివరకు 46.00 పాయింట్ల లాభంతో 17,991.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.49 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభపడ్డాయి. టైటన్‌ 5.55 శాతం మేర లాభపడడం విశేషం. బజాజ్ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌ షేర్లు రాణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా షేర్లు మాత్రం నష్టాలు చవిచూశాయి.