Begin typing your search above and press return to search.

రాజ్యసభలో రణరంగం..వ్యవసాయ బిల్లులకు ఆమోదం

By:  Tupaki Desk   |   20 Sept 2020 3:40 PM IST
రాజ్యసభలో రణరంగం..వ్యవసాయ బిల్లులకు ఆమోదం
X
ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్యే రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ఈ వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించినట్టైంది.

ఇప్పటికే 3 వ్యవసాయ బిల్లులకు లోక్ సభలో విశేష బలం ఉన్న బీజేపీ నెగ్గించుకుంది. ఇక రాజ్యసభలో విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.

కాగా ఓటింగ్ పెడితే ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా సొంత పక్షాలు సైతం ఓటు వేసే పరిస్థితులు వుండడంతో వ్యూహాత్మకంగా బీజేపీ సర్కార్ డిప్యూటీ చైర్మన్ ను రంగంలోకి దించి మూజువాణి ఓటుతో పని పూర్తి చేశారు.

ఈ సందర్భంగా విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు వీగిపోయాయి. అనంతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సభను రేపటికి వాయిదా వేశారు.

కాగా ఈ వ్యవసాయ బిల్లులకు మద్దతుగా విపక్ష సభ్యులు నినాదాలు చేసి పోడియం వద్దకు దూసుకొచ్చారు. వ్యవసాయ బిల్లుల ప్రతులను చించేసి డిప్యూటీ చైర్మన్ పైకి విసిరారు. ఆయన వద్ద మైకు లాగేందుకు ప్రయత్నించారు.దీంతో అతికష్టం మీద రాజ్యసభ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

దీంతో రాజ్యసభలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల ఎంపీలు తీవ్ర నిరసన తెలిపాయి. పోడియం వద్ద గందరగోళం సృష్టించాయి. దీంతో మూజువాణి ఓటుతో బీజేపీ బిల్లులను గట్టెక్కించింది.