Begin typing your search above and press return to search.

విభజన వివాదంపై కేంద్రం స్పందించింది!

By:  Tupaki Desk   |   9 July 2015 10:32 AM IST
విభజన వివాదంపై కేంద్రం స్పందించింది!
X
విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీలు ఎన్నో. ఇప్పటికి ఉన్నవి సరిపోనట్లు రోజుకో కొత్త పంచాయితీ తెర మీదకు వస్తున్న విషయం విదితమే. వీటిపై కేంద్రం పెద్దగా స్పందించింది లేదు. ఈ మధ్యన ఆంధ్రా మూలాలు ఉన్నాయన్న మాటతో తెలంగాణలో పని చేస్తున్న విద్యుత్తు ఉద్యోగుల్లో 1259 మందిని ఏకపక్షంగా రిలీవ్‌ చేయటం.. వారికిప్పుడు ఎక్కడా పోస్టింగ్‌ లేకపోవటంతో వారు ఆందోళన చేస్తున్నారు.

ఇప్పటికే పలుచోట్ల ఫిర్యాదులు చేసిన వీరు.. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి ద్వారా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. దీనిపై ఆయన కాసింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఒకేసారి 1259 మంది ఉద్యోగుల్ని తొలగించటం ఏమిటంటూ ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన ఆయన ఆదేశాలతో పరిణామాలు చకచకా కదిలాయి.

ఈ అంశంపై చర్చించటానికి ఈ నెల 31న ఉదయం 11 గంటలకు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలంటే ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి రెండురాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో పాటు.. ఇంధన కార్యదర్శులు.. సీఎండీలు రావాలని ఆదేశించారు. విభజన తర్వాత తెరపైకి వచ్చిన ఒక వివాదానికి సంబంధించి.. ఒకరు చేసిన ఫిర్యాదు ఆధారంగా సమావేశాన్ని నిర్వహించటం ఒక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. మరి.. ఈ సమావేశం ఏదైనా ఫలితాల్ని తేలుస్తుందా? కేవలం సమావేశమై ఊరుకుంటుందా? అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.