Begin typing your search above and press return to search.

ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే..కొత్త పార్టీ పై కీలక ప్రకటన చేయనున్న రజనీకాంత్!

By:  Tupaki Desk   |   24 Oct 2020 12:45 PM IST
ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే..కొత్త పార్టీ పై కీలక ప్రకటన చేయనున్న రజనీకాంత్!
X
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. గత కొన్ని రోజులుగా రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈయన రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా చెప్పి రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆయన అభిమానుల హడావుడి మినహా రాజకీయ పార్టీని ప్రకటించిందిలేదు. రజనీకాంత్‌ కంటే కాస్త వెనుక తానూ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన ఆయన సహ నటుడు కమలహాసన్‌ పార్టీని నెలకొల్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేయించారు.

ఇప్పటికే ఎన్నోసార్లు పార్టీ ప్రకటనకి ముహూర్తం సిద్ధం అంటూ , ఆ తరువాత వాయిదా వేయడం పరిపాటిగా వస్తుంది. అయినప్పటికీ రజిని పొలిటికల్ ఎంట్రీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో అన్ని ప్రధాన పార్టీలు కూడా ఇప్పటినుండే అభ్యర్థులపై కసరత్తులు మొదలుపెట్టాయి. అలాగే ఓటర్లను ఆకట్టుకోవడానికి వ్యూహాలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రజినీకాంత్ ఖచ్చితంగా కొత్త పార్టీ ప్రకటించి, పోటీచేయబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే రజిని మక్కల్ మండ్రం లో కోలాహలం మొదలైంది. త్వరలోనే పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో తన ఆర్గనైజేషన్ మక్కల్ మండ్రంలో కొత్త సభ్యులను ముమ్మరంగా చేర్పించాలని ఆయా జిల్లాల శాఖ నాయకులను రజనీకాంత్ ఆదేశాలు జారీచేశారు. అధినేత ఆదేశాలతో కీలక నేతలందరూ సభ్యత్వ ఫారాలు చేత పట్టి పార్టీలో కొత్త సభ్యులను చేర్పించే పనిలో బిజీబిజీగా మారిపోయారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంఘంలో రెండు నెలల క్రితమే బూత్ కమిటీ సభ్యుల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇకపోతే, తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆన్ ‌లైన్‌ లో సభ్యత్వాన్ని ప్రారంభించగా, ఆ దశగా ప్రయత్నించాలని ఆయా శాఖల నాయకులను రజనీ కోరారు. అలాగే సభ్యులుగా చేరిన వారికి వెంటనే ఫొటో గుర్తింపు కార్డు ఇవ్వాలని సూచించారు. సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన వెంటనే రజనీ తన పార్టీని ప్రారంభిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.