Begin typing your search above and press return to search.

అసెంబ్లీ భేటీకి మిశ్రా ఓకే... గెహ్లాట్ గడ్డన పడ్డట్టేనా?

By:  Tupaki Desk   |   27 July 2020 5:00 PM GMT
అసెంబ్లీ భేటీకి మిశ్రా ఓకే... గెహ్లాట్ గడ్డన పడ్డట్టేనా?
X
పవర్ పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా మారిన రాజస్థాన్ లో పరిస్థితులు చల్లారినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగంగా ఆ పార్టీకి చెందిన కీలక నేత సచిన్ పైలట్ తనదైన శైలి వ్యూహానికి పదును పెట్టడంతో రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మనుగడ కష్టమేనన్న వాదనలు వినిపించాయి. అయితే ఇదంతా తెర వెనుక నుంచి బీజేపీ నడిపిస్తున్న రాజకీయమేనని ఆరోపిస్తున్న గెహ్లాట్... తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శతదా యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీని సమావేశపరచాలని, ప్లేటు ఫిరాయించిన పైలట్ వర్గంపై వేటు వేయాలని గెహ్లాట్ చేస్తున్న యత్నాలను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా అంతగా పట్టించుకోవడం లేదు. అయితే అనూహ్యంగా సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి మిశ్రా నుంచి సానుకూల స్పందన రావడంతో గెహ్లాట్ వర్గానికి పెద్ద ఊరట లభించినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడం,ఎమ్మెల్యేలపై అనర్హత వేటును చట్టపరంగా ఎదుర్కోవడంలో స్పీకర్ వెనక్కి తగ్గడం, రాజకీయ కుట్రలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్రలకు గవర్నర్ సహకరిస్తున్నారని కాంగ్రెస్ బహిరంగంగానే ఆరోపణలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు ఇదివరకే నోటీసులిచ్చినా మిశ్రా ప్రతికూలంగా స్పందించడంతో ఆ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అయితే ఎట్టకేలకు గవర్నర్ నుంచి కాంగ్రెస్‌కు ఓ సానుకూల కబురు అందింది. అసెంబ్లీ సమావేశాలకు సిద్దం కావాలని రాజస్తాన్ గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కబురు అందించారు. సమావేశాలను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా మిశ్రా వ్యాఖ్యానించడం గమనార్హం.

అయితే సమావేశాల ఏర్పాటుకు 3 కీలక అంశాలను పాటించాల్సి ఉంటుందని గెహ్లాట్ ప్రభుత్వానికి మిశ్రా కండీషన్ పెట్టారు. ప్రభుత్వం 21 రోజుల వ్యవధితో అసెంబ్లీ సమావేశాలకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో షార్ట్ నోటీసుతో ఎమ్మెల్యేలందరిని అసెంబ్లీ సమావేశాలకు పిలవలేమని చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెడితే... వీడియో రికార్డింగ్ చేపట్టడం, ఓటింగ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం, అవును లేదంటే కాదు అన్న బటన్ల ద్వారా మాత్రమే ఓటింగ్ ను చేపట్టడం వంటి నిబంధనలను చేర్చగలరా? అని గవర్నర్ ప్రశ్నించారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లో భౌతిక దూరం నిబంధనను ఎలా అమలు చేస్తారో చెప్పాలని కూడా గెహ్లాట్ ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. ఏది ఏమైనా కీలకమైన అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి రావడంతో సంక్షోభం నుంచి గెహ్లాట్ ప్రభుత్వం గడ్డన పడ్డట్టేనన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.