Begin typing your search above and press return to search.

ఆడియో టేపుల కలకలం: ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు

By:  Tupaki Desk   |   17 July 2020 1:20 PM IST
ఆడియో టేపుల కలకలం: ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు
X
రాజస్థాన్‌ ప్రభుత్వంలో ఏర్పడిన ప్రతిష్టంభన పూటకో అనూహ్య ఘటన చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఆ రాష్ట్రంలో ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆడియో టేపులతో బహిర్గతమైంది. దీంతో వారిద్దరిపై వేటు వేశారు. ఆ ఇద్దర్నీ పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ.. వారి ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసింది. ఈ మేరకు వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా తెలిపారు.

‘రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఈ ఇద్దరూ బీజేపీ నేతలతో మంతనాలు సాగించినట్టు ఆడియో టేపులు గురువారం బయటకు వచ్చాయి. ఈ ఆడియోలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్‌లు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ మాట్లాడుతూ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు సాగించారు’ అని సూర్జేవాల్ ఆరోపణలు చేశారు. ఆడియో టేపుల వ్యవహారంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై ఎస్ఓసీ పోలీసులు కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బేరసారాలకు పాల్పడినట్టు తేలితే, వారెంట్ జారీ చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ, బీజేపీ నేత సంజయ్ జైన్‌పై కూడా కేసు నమోదు చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి బ్లాక్ మనీ ఎవరు ఏర్పాటు చేశారో, ఎవరు ఇచ్చారు అనే దానిపై కూడా దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్‌కు సహకరించడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని బీజేపీ మిత్రపక్షం ఆర్ఎల్పీ నేత హనుమాన్ బేనీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వర్గాన్ని దెబ్బతీయడానికి రాజే పావులు కదుపుతున్నట్టు ఆరోపించారు.

‘తనకు సన్నిహితులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఫోన్ చేసి.. అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు.. సచిన్ పైలట్‌కు దూరంగా ఉండాలని సికార్, నాగౌర్‌లోని ప్రతి ఒక్క జాట్ ఎమ్మెల్యేకు చెప్పారు.. ఇందుకు ఆధారాలున్నాయి’ అని హనుమాన్ బేనీవాల్ ట్వీట్ చేశారు.