Begin typing your search above and press return to search.

ఆ రికార్డ్ ను అందుకున్న 10వ బ్యాట్స్‌మన్‌ రాహుల్.. ఏంటా రికార్డ్

By:  Tupaki Desk   |   19 Aug 2021 12:30 PM GMT
ఆ రికార్డ్ ను అందుకున్న 10వ బ్యాట్స్‌మన్‌ రాహుల్.. ఏంటా రికార్డ్
X
కేఎల్ రాహుల్ .. టీమిండియా క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఆటగాడు. ఇప్పటివరకు ఎంతోమంది మంచి, మేటి ఆటగాళ్లు టీమిండియా కి ఆడినప్పటికి , కేఎల్ రాహుల్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన ఆట లో టెక్నిక్ మార్చుకుంటూ , రోజురోజుకి ఆటలో మరింతగా రాటుదేలాడు. 2018లో సెంచరీ కొట్టినప్పుడు కేఎల్ రాహుల్, టెస్ట్‌ ల్లో పర్మినెంట్ ప్లేయర్ అనుకున్నారు. కానీ, ఆ తర్వాత మళ్లీ సంప్రదాయక ఫార్మాట్ ఆడటానికి అతనికి మూడేళ్లు పట్టింది. ఈ మధ్య కాలంలో టీమిండియా చాలా టెస్ట్ మ్యాచ్‌ లు ఆడింది.

కానీ రాహుల్‌కు ప్లేస్ మాత్రం దొరకలేదు. కుర్రాళ్ల నుంచి పోటీ ఎక్కువ కావడం. ఎక్కువగా వైట్ బాల్ మ్యాచ్‌లపై దృష్టిపెట్టడంతో టెస్ట్‌లకు దూరయ్యాడు. అయితే శుభ్‌ మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయాల బారిన పడటంతో , వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని రాహుల్ అందిపుచ్చుకున్నాడు. భారత్ నుంచి తొమ్మిది మంది మాత్రమే సెంచరీ చేసిన క్రికెట్ మక్కా, లార్డ్స్ హానరరీ బోర్డు మీద తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. టెస్ట్‌ ల్లో రాహుల్ కొత్త రాహుల్ ను తలపిస్తున్నాడు. రెండో టెస్ట్‌లో భారత్ గెలవడంతో అందరూ బౌలర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ బ్యాటింగ్‌లో అంతకుమించిన పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కూడా ఈ ప్రశంసలకు అర్హుడే. ఎందుకంటే మూడేళ్ల కిందట టెస్ట్‌ల్లో అతను కీలక ప్లేయర్.

కానీ ఈ సిరీస్‌కు ముందు ప్లేస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఆటగాడు. శుభ్‌ మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వంటి ఆటగాళ్ల నుంచి విపరీతమైన పోటీ ఉండటంతో ఓ దశలో ఆడే చాన్స్ దక్కుతుందని ఎవరూ ఊహించలేదు.కానీ గిల్, మయాంక్ గాయాల బారిన పడటం, పృథ్వీ లేట్‌గా రావడంతో రాహుల్‌కు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ కర్ణాటక బ్యాట్స్‌ మన్ గతంతో పోలిస్తే బ్యాటింగ్‌ లో చాలా రాటుదేలాడు. ఒకప్పుడు రాహుల్ షాట్స్ కొట్టడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. దీనివల్ల త్వరగా ఔటయ్యేవాడు. దీంతో టెస్ట్‌లకు పనికిరాడనే ముద్ర కూడా పడింది. కానీ ఇప్పుడు అతని లక్ష్యం మారింది. తనదైన డిఫెన్స్‌ తో పాటు, క్రమశిక్షణ కలిగిన బ్యాటింగ్‌ తో ఆకట్టుకుంటున్నాడు. గతంలో నేను పరుగుల గురించే ఎక్కువగా ఆలోచించా.

దానివల్ల ఎక్కువ షాట్స్ కొట్టేవాడ్ని. ఆ క్రమంలో త్వరగా ఔట్ కావడంతో ఒత్తిడి పెరిగేది. కానీ ఇప్పుడు నా బ్యాటింగ్‌ ను ఆస్వాదిస్తున్నా. బౌలర్లు మంచి మైండ్‌ సెట్‌ తో గుడ్ స్పెల్స్ వేస్తే నేను నా టెక్నిక్, డిఫెన్స్‌ ను నమ్ముకుంటున్నా. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. నా దృష్టంతా నాకు ఇచ్చిన బాధ్యతపైనే. వ్యక్తిగత గోల్స్‌ ను పక్కన బెట్టేశా. దీనివల్ల ఆటపై ఏకాగ్రత పెరిగింది అని రాహుల్ చెప్పుకొచ్చాడు. స్ట్రయిక్ రేట్ పట్టించుకోకుండా బంతిని ఎదుర్కొనేందుకు అవసరమైన స్ట్రయిక్ పాయింట్స్‌ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో రాహుల్ 360 డిగ్రీ ప్లేయర్. ఓపెనర్‌ గా మిడిల్, డెత్ ఓవర్లలోనూ బ్యాటింగ్ చేసే సత్తా ఉంది.

అయితే లార్డ్స్ వచ్చేసరికి అతను పూర్తి భిన్నంగా ఆడాడు. ఈ స్కిల్స్‌ను అలాగే కొనసాగిస్తే , రెగ్యులర్ ఓపెనర్లు వచ్చినా అతని ప్లేస్‌కు డోకా ఉండకపోవచ్చు. ఇక రాహుల్‌ జోరుతో తాజా సిరీస్‌లో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా బెంచ్‌ కే పరిమితం కానున్నారు. ఈ కర్ణాటక బ్యాట్స్‌ మన్ రెండు చేతులా తనకి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 250 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌ తో 129 రన్స్ చేసిన రాహుల్, రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌ కు 126 పరుగులు, కోహ్లీతో కలిసి 117 పరుగుల కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చాక బ్యాటు ఝులిపించాడు. ఈ క్రమంలో లార్డ్స్‌ మైదానంలో సెంచరీ చేయడం ద్వారా వినూ మన్కడ్‌, గుండప్ప విశ్వనాథ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, రవిశాస్త్రి, మహమ్మద్‌ అజారుద్దీన్‌, సౌరవ్‌ గంగూలీ, అగర్కార్‌, రాహుల్‌ ద్రవిడ్‌, రహానే తర్వాత పదో భారత క్రికెటర్‌ గా రాహుల్‌, ఆనర్స్‌ బోర్డులో పేరు దక్కించుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్, కోహ్లీకే ఈ ఘనత సాధ్యంకాలేదు.

రాహుల్ సూపర్ ఇన్నింగ్స్‌కు బౌలర్ల అసాధారణ ప్రదర్శన కూడా తోడవ్వడంతో లార్డ్స్ టెస్ట్‌ లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 రన్స్ చేసి 27 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌ లో 194 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును మహమ్మద్ షమీ, జస్‌ ప్రీత్ బుమ్రా 9వ వికెట్‌ కు అజేయంగా 89 పరుగులు జోడించి గట్టెక్కించారు. దాంతో కోహ్లీసేన 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం పాలైంది. ఇక మూడో టెస్ట్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కాబోతుంది.