Begin typing your search above and press return to search.
ఆ లెక్కలు సరిచేసేందుకే పంచెకట్టులో రాహుల్
By: Tupaki Desk | 22 March 2018 10:55 AM ISTకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నారు. కొద్దికాలంగా ఆయన దేవాలయాలకు ఎక్కువగా వెళుతూ హిందువులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మరింత ట్విస్ట్ ను తాజాగా ఆయన జోడించారు. ఆయన శృంగేరి శారదాపీఠాన్ని సందర్శించారు. క్రీ.శ. 8వ శతాబ్దంలో జగద్గురు శంకరాచార్య ప్రతిష్ఠించిన నాలుగు పీఠాల్లో ఇదికూడా ఒకటి. కాగా రాహుల్ గాంధీ శ్రీ భారతీ తీర్థస్వామిని కలుసుకున్నారు. సంప్రదాయ పంచెను ధరించి పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆలయాన్ని దర్శించిన ప్రత్యేక పూజలు జరిపారు. ఎన్నికల సమయంలో హిందూ ఓట్లను ఆకట్టుకునేందుకు తమ నాయకుడు ఈ కొత్త వస్త్రాదారణలో వచ్చారని ఆ పార్టీ కర్ణాటక నేతలు అంటున్నారు.
కాగా, శృంగేరీ సంస్కృత విశ్వవిద్యాలయంలో `ధర్మానికి’ 14 సంవత్సరాల బాలుడు ఇచ్చిన నిర్వచనాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంతో ప్రశంసించారు. ‘సత్యమేవ జయతే’ అనేదే ధర్మానికి ఆధారమని ఆ బాలుడు చెప్పాడని, ఇది నరేంద్ర మోడీకి తెలియదని ఎద్దేవా చేశారు. అసలు `ధర్మం’ అంటే నిజమైన అర్థం ఏమిటో ప్రధానికి తెలియదని పేర్కొన్నారు. ప్రధాని హృదయం ప్రేమ, సహానుభూతితో నిండినప్పుడు మాత్రమే ఆయన విజయం సాధించగులుగుతారన్నారు. కాగా, కర్ణాటకలో వరుసగా రెండో రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన మోడీపైనే విమర్శలు ఎక్కు పెట్టారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని రాహుల్ స్పష్టం చేశారు.
కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ‘ మోడీ పాలన ప్రారంభమై నాలుగేళ్లు గడిచింది. ఇన్నాళ్లూ ఆయన సుదీర్ఘ ప్రసంగాలతోనే సరిపోయింది. నేను అధికారంలోకి రావడానికి ఏడాది సమయముంది. రాబోయే ఎన్నికల్లో మోడీ విజయం సాధించడం కల్ల’ అని రాహుల్ అన్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నడూ - తనకంటే ముందు భారత్ లో ఏమీ జరగలేదన్న మాట మాట్లాడలేదని రాహుల్ అన్నారు. `చైనా డోక్లామ్ లో తిష్ఠవేసింది. దక్షిణ డోక్లామ్ కు చేరుకునేందుకు కొత్త మార్గాన్ని నిర్మిస్తోంది. నిజంగా చైనా మౌనంగా తెలివిగా తనపని తాను చేసుకుపోతోంది. చైనా అక్కడ రోడ్లు - హెలిప్యాడ్లు - విమానాశ్రయం వంటివి నిర్మిస్తోంది. ఇది దేశానికంతా తెలిసిందే - కానీ దానిపై నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడరు` అంటూ విమర్శించారు.
