Begin typing your search above and press return to search.

రాహుల్..ప్లాన్ బీ కోసం చెమ‌టోడుస్తున్నాడే

By:  Tupaki Desk   |   29 Aug 2018 7:08 PM IST
రాహుల్..ప్లాన్ బీ కోసం చెమ‌టోడుస్తున్నాడే
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తన పార్టీకి పుర్వ‌వైభవం కోసం శ్ర‌మిస్తున్నారు. హిందూ వ్యతిరేక - మైనారిటీలను బుజ్జగించే పార్టీ అనే ముద్రనుంచి కాంగ్రెస్‌ను గట్టెక్కించడానికి కాంగ్రెస్ ర‌థ‌సార‌థి చెమ‌టోడుస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దికాలం క్రితం తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చిన ప్ర‌ణాళిక‌ను ఆయ‌న మ‌రింత వేగంగా పెంచారు. హిందూ వ్య‌తిరేక‌త‌ను తొల‌గించుకోవ‌డం భాగంగానే పలు హిందూ దేవాలయాలను సందర్శించి రాహుల్‌ పూజలు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇలాక అయిన గుజ‌రాత్ నుంచి మొద‌లైన ఈ ట్రెండ్ అనంత‌రం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కూడా అమ‌ల్లో పెట్టారు. తాజాగా ఇప్పుడు హిందువులు ప‌విత్రంగా భావించే మాన‌స స‌రోవ‌ర్ విష‌యంలోనూ అమ‌ల్లో పెట్టేస్తున్నారు. ఈ నెల చివరిలోపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానస సరోవర యాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ హిందుత్వ ఎజెండాకు చెక్ పెట్టే ఉద్దేశంతో గుజరాత్ - కర్ణాటక ఎన్నికల్లో కనిపించిన గుళ్లన్నీ తిరిగిన రాహుల్.. ఇప్పుడీ యాత్రతో మరో బలమైన సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.

22 ఏళ్ల‌పాటు గుజరాత్‌ లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాహుల్‌ గాంధీ హిందూత్వ విధానం ఎత్తుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ గాంధీ 15 రోజుల్లో 23 ఆలయాలను సందర్శించారు. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. ఢిల్లీలో తన ఇంటికి దగ్గరలో ఉన్న అక్షరధామ్‌ ను ఎన్నడూ సందర్శించని రాహుల్.. గుజరాత్‌ లో ఆలయాలను సందర్శించడం కేవలం రాజకీయాల కోసమేనని బీజేపీ విమర్శించింది. అయిన‌ప్ప‌టికీ క‌ర్ణాట‌క ప్ర‌చారంలో కూడా రాహుల్ ఈ ఒర‌వ‌డిని కొన‌సాగించారు. ప్ర‌చారం చేశారు. దానికి కొన‌సాగింపుగా ఆయ‌న మాన‌స‌స‌రోవ‌ర్ యాత్ర చేప‌డుతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రామ్‌ లీలా మైదాన్‌ లో జరిగిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో తాను ఈ యాత్ర చేస్తానని రాహుల్ ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో తనకు తృటిలో విమాన ప్రమాదం తప్పిందని, అప్పుడే ఈ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ చెప్పారు. ఆ ఎన్నికల సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం.. కొన్ని నిమిషాల పాటు రాడార్‌ కు చిక్కకుండా పోయింది.అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో అప్పుడే తాను ఆ పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. తనకు తాను శివ భక్తుడిగా ప్రకటించుకున్న రాహుల్.. శివ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర చేపట్టనుండటం ఆసక్తి రేపుతున్నది. అయితే ఇప్పటివరకు ఈ యాత్ర కోసం రాహుల్‌గాంధీ దరఖాస్తు చేసుకోలేదని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్ర చైనా గుండా సాగుతుండటం వల్ల ముందుగానే యాత్రికులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా అనుమతి తీసుకోవడం లేదా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా యాత్ర చేసే అవకాశాలు రాహుల్ ముందు ఉన్నాయి.