Begin typing your search above and press return to search.

సాగు చట్టాల రద్దు ఉద్యమంలో.. అమరులు వీరే : రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   7 Dec 2021 4:00 PM IST
సాగు చట్టాల రద్దు ఉద్యమంలో.. అమరులు వీరే : రాహుల్ గాంధీ
X
నిరుడు చలికాలంలో ప్రారంభమైంది ఆ ఉద్యమం.. అసలే ఢిల్లీ.. ఆపై ఎముకలు కొరికే చలి.. వేలాదిమంది అన్నదాతలు రోడ్డెక్కారు. శీతాకాలమంతా పోరాడారు. ఆపై మాడు పగిలే ఎండలకు ఎదురొడ్డారు.. ఇటీవలి వర్షా కాలంలోనూ తిప్పలు పడ్డారు.

వీరికితోడు పంజాబ్, యూపీ, హరియాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర్ట్రాల్లో నిత్యం ఏదో ఒక ఆందోళనలు.. ప్రదర్శనలు.. యూపీలో ఏకంగా కేంద్రమంత్రి కుమారుడే రైతుల పైకి కారు పోనిచ్చాడు. ఇదీ సాగు చట్టాల రద్దు కోరుతూ రైతులు సాగించిన ఉద్యమం. ప్రభుత్వాల నిర్బంధాలు.. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమన్న కేంద్ర ప్రకటనలతో బలవన్మరణాలు.. ఉద్యమంలో ఆగిన గుండెలు.. ఏమైతేనేం.. 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం లేదన్న కేంద్రం

ఏదయినా అనుభవం అయితేనే గానీ తత్వం బోధపడదన్నట్లు.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో ఓటమి, త్వరలో యూపీ, పంజాబ్ ఎన్నికల్లో కష్ట కాలం రానుందన్న అంచనాతో కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను ఉన్న పళంగా రద్దు చేసింది. రైతు నేతలు అంతటితో సమ్మతించక మరికొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వంతో మంగళవారం చర్చలు నడుస్తున్నాయి. ఈ డిమాండ్లలో ముఖ్యమైనది.. సాగు చట్టాల రద్ద ఉద్యమం సందర్భంగా అమరులైన రైతుల కుటుంబాలు పరిహారం చెల్లింపు. దీనిని రైతు సంఘాలు గట్టిగా పట్టుబడుతుండడంతో.. ప్రభుత్వం అసలు ఎంతమంది రైతులు ఉద్యమంలో చనిపోయారో తమ వద్ద లెక్కలు లేవని ప్రకటించింది.

ఓవైపు రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వంరూ.3 లక్షలు పరిహారం ప్రకటిస్తే, కేంద్ర ప్రభుత్వం ధోరణి భిన్నంగా ఉండడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పందిస్తూ.. రైతులు మృతిచెందారా? మాకు తెలియదే? అనడం పుండు మీద కారం చల్లినట్లయింది.

ఇదిగో జాబితా అని చూపిన రాహుల్ గాంధీ

రైతుల మరణాల వ్యవహారంపై లోక్‌సభలో మాట్లాడిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. 700 మంది రైతులు అమ‌రుల‌య్యారని పేర్కొన్నారు. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాప‌ణ‌లు కూడా కోరారు, కానీ, ఆ అమ‌ర రైతుల డేటా ప్రభుత్వం ద‌గ్గర లేదా? అంటూ మండిపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలతో త‌ప్పు చేసిన‌ట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకున్నారని, కానీ, వ్యవ‌సాయ శాఖ మంత్రి మాత్రం ప్రాణాలు కోల్పోయిన రైతుల స‌మాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

న‌వంబ‌ర్ 30వ తేదీన వ్యవ‌సాయ మంత్రిని ప్రశ్నించ‌గా.. త‌మ వ‌ద్ద మ‌ర‌ణించిన రైతుల డేటా లేద‌ని చెప్పిన‌ట్లు రాహుల్ గుర్తుచేశారు.. సాగు చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాల‌కు పంజాబ్ ప్ర‌భుత్వం న‌ష్టప‌రిహారం ఇచ్చిందన్న రాహుల్.. త‌న ద‌గ్గర ఆ జాబితా ఉంద‌ని, దాన్ని సభలోపెట్టామ‌న్నారు.

హ‌ర్యానాలోనూ అమ‌ర రైతు కుటుంబాల‌కు ప‌రిహారం ఇచ్చిన‌ లిస్టు కూడా స‌భ‌లో పెట్టామ‌న్నారు. ఇలాంటి సంద‌ర్భంలో రైతులు ఎవ‌రూ చ‌నిపోలేద‌ని ప్రభుత్వం ఎలా చెబుతోంద‌ని నిలదీసిన ఆయన.. క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ.. రైతులకు పరిహారం కూడా అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

భలే అందుకున్నారే..

రైతు ఉద్యమంలో అమరులైనవారి జాబితా లేదనడం.. అసలు రైతులు చనిపోయారా? మాకు తెలియదే ? అని కేంద్ర మంత్రి చెప్పడం బీజేపీకి పెద్ద మైనస్. ఇదే సమయంలో.. ఇదిగో అమరుల జాబితా అంటూ అది కూడా పార్లమెంటులో రాహుల్ గాంధీ చూపడం కాంగ్రెస్ కు పెద్ద ప్లస్. కానీ, ప్లస్ లను ఉపయోగించుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? అన్నది ప్రశ్న.