Begin typing your search above and press return to search.

భార‌త దేశంలో పాకిస్థాన్ పాల‌న‌.. : నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   22 May 2022 12:50 PM IST
భార‌త దేశంలో పాకిస్థాన్ పాల‌న‌.. :  నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌
X
లండన్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో పాకిస్థాన్‌ తరహా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. దేశమంతా బీజేపీ కిరోసిన్ చల్లిందని.. సంక్షోభం తలెత్తేందుకు ఓ చిన్న నిప్పురవ్వ చాలని అన్నారు. దేశ భూభాగంలో చైనా తిష్ఠ వేసిందని మండిపడ్డారు. ఇప్పుడు సంక్షోభం తలెత్తడానికి ఓ చిన్న నిప్పురవ్వ చాలని నరేంద్ర మోడీ పాలనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన 'ఐడియాస్‌ ఫర్‌ ఇండియా' సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, ఆరెస్సెస్‌లపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ తరహా పాలన భారత్‌లో సాగుతోందని విమర్శించారు. అక్కడిలానే ఈడీ, సీబీఐ లాంటి సంస్థలే దేశాన్ని నియంత్రిస్తున్నాయని ఆక్షేపించారు. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)పై నిప్పులు చెరిగారు.

ఆ సంస్థ.. దేశంలోని వ్యవస్థలను కబ్జా చేసిందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలపై దాడి జరుగుతోం దని, భారత్‌లో ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడిందని, ఇది అంతర్జాతీయ సమాజానికి ఏమాత్రం క్షేమకరం కాదని రాహుల్‌ హెచ్చరించారు. భారత్‌ 'ఆత్మ' పెనుప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.

రాజ్యాంగం ప్రకారం.. భారత్‌ ఓ దేశం కాదని, రాష్ట్రాల సమాఖ్య అని, ఈ విషయాన్ని కేంద్రం గుర్తించక పోవడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాలపై తీవ్ర అణచివేత సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వ్యవస్థలన్నీ రాష్ట్రాల మధ్య చర్చలు, సంవాదంతోనే ఏర్పడ్డాయని, ఇప్పుడు ఆ సంవాదమే ఆగిపోయిం దని, వ్యవస్థలను ఓ సంస్థ కబ్జా చేసిందని అన్నారు. దీంతో రాష్ట్రాలు మాట్లాడలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఓ భౌగోళిక ప్రాంతంగా, బంగారు చిలకగా బీజేపీ భావిస్తోందని రాహుల్‌ అన్నారు. బంగారు చిలక ప్రయోజనాలను అందరికీ సమానంగా పంచకుండా కొందరికే అధికంగా దోచిపెడుతోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు బీజేపీతో పోరాడే భావజాలం లేదని ఉదయ్‌పుర్‌లో జరిగిన చింతన శిబిరంలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ వివరణిచ్చారు.

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీలకంటే కాంగ్రెస్‌ గొప్పేమీ కాదని, బీజేపీపై పోరాటంలో తమ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే ఆరెస్సెస్‌, కాంగ్రెస్‌ మధ్య జాతీయస్థాయిలో భావజాల పోరాటం సాగుతోందని తెలిపారు. మ‌రి రాహుల్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.