Begin typing your search above and press return to search.

విజిటింగ్ కార్డు అధ్య‌క్షుల‌కు రాహుల్ చెక్ చెప్పారా?

By:  Tupaki Desk   |   8 Feb 2019 12:22 PM IST
విజిటింగ్ కార్డు అధ్య‌క్షుల‌కు రాహుల్ చెక్ చెప్పారా?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌న్న ధీమాను వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ బొక్క‌బోర్లా ప‌డిన వైనం తెలిసిందే. లెక్క తేడా ఎందుకు కొట్టింద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇంత దారుణ ఓట‌మిని ఏ మాత్రం ఊహించని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం మాత్రం ఒకింత షాక్ తిన్న‌ట్లు చెబుతున్నారు. తీవ్ర ఓట‌మి త‌ర్వాత స్త‌బ్దుగా మారిన కాంగ్రెస్ లో ఒకింత ఉత్సాహంతో పాటు.. నాయ‌క‌త్వ మార్పు దిశ‌గా పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇటీవ‌ల ఢిల్లీలో రాహుల్ తో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు.. త‌మ చ‌ర్చ సంద‌ర్భంగా ఉమ్మ‌డి జిల్లాల పార్టీ అధ్యక్షుల‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. విజిటింగ్ కార్డులు కొట్టించుకోవ‌టం మిన‌హా వారు పార్టీకి చేస్తున్నది ఏమీ లేద‌న్న మాట నేప‌థ్యంలో పార్టీకి శ‌స్త్ర‌చికిత్స చేసి కొత్త ర‌క్తాన్ని ఎక్కించే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ‌లో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల‌కు సంబంధించి 30 జిల్లాల‌తో పాటు.. హైద‌రాబాద్‌..ఖ‌మ్మం.. వ‌రంగ‌ల్‌.. నిజామాబాద్ న‌గ‌రాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌ను నియ‌మించారు.

తాజాగా విడుద‌ల చేసిన జాబితాను చూస్తే.. డీసీసీ అధ్యక్షులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ ను నియ‌మించారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్ని చూస్తే.. ప‌న్నెండు మంది వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వారు ఉండ‌గా.. మ‌రో ప‌ది మంది రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు.. ఎస్సీ..ఎస్టీ.. మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన ఇద్ద‌రు చొప్పున‌.. క‌మ్మ‌.. వెల‌మ‌.. బ్రాహ్మ‌ణ వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం ఇచ్చారు.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమంటే.. తాజా ఎమ్మెల్యేల‌ను జిల్లా అధ్య‌క్షులుగా చేయ‌టంతో పాటు.. కొంద‌రు మాజీ ఎమ్మెల్యేల‌ను కూడా అధ్య‌క్షులుగా నియ‌మించారు. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల స‌తీమ‌ణుల‌కు కూడా పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ల‌భించింది. అలాంటి అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న వారిలో జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి స‌తీమ‌ణి గండ్ర జ్యోతి.. రంగారెడ్డి జిల్లా అధ్య‌క్షురాలిగా ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి స‌తీమ‌ణి నిర్మ‌ల‌ను నియ‌మించారు. ఎన్నిక‌ల వేళ‌లో జ‌గ్గారెడ్డి అరెస్ట్ కావ‌టం.. అదే విధంగా కేసుల చిక్కుల్లో చిక్కుకున్న గండ్ర‌ల‌ను వారి స‌తీమ‌ణులు కీల‌క భూమిక పోషించి భ‌ర్త ల విజ‌యంలో శ్ర‌మించిన వైనం అధినాయ‌క‌త్వం దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో.. వారికి జిల్లా పార్టీ ర‌థ‌సార‌ధులుగా ప‌ద‌వులు ద‌క్కాయి.