Begin typing your search above and press return to search.

జగన్ కు సెల్యూట్ చేసిన పీపుల్స్ స్టార్

By:  Tupaki Desk   |   8 Feb 2020 1:26 PM IST
జగన్ కు సెల్యూట్ చేసిన పీపుల్స్ స్టార్
X
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై పీపుల్స్ స్టార్ గా పేరొందిన దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. తాను ఎర్రసముద్రంలో పేర్కొన్నట్టు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని నేడు జగన్ ప్రవేశపెట్టారని చెబుతూ దీనికి అతడికి సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంబేడ్కర్‌ ఆశయ సాధన సీఎం జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు.

శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ జుపూడి ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆర్.నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంగ్ల విద్య ద్వారా పేద, ధనిక అంతరాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బడుగు, బలహీన వర్గాలకు ఇంగ్లీష్‌ విద్య అవసరమని గుర్తుచేశారు. తెలుగు భాష అమ్మలాంటిదని, ఇంగ్లీష్‌ భాష నాన్నలాంటిదని పేర్కొన్నారు. ఇంగ్లీష్‌ విద్య తీసుకువచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు అందరూ రుణపడి ఉంటారని, ఈ విధానానికి రాజకీయ నేతలంతా సహకరించాలని కోరారు.

రాజధాని అంశంపై కూడా నారాయణ మూర్తి స్పందించారు. మూడు రాజధానులను తాను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అమరావతి రాజధాని ఉండగా కర్నూలుకు అన్యాయమైందని, ఇప్పుడు మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న జగన్ ను తాను అభినందిస్తున్నట్లు తెలిపారు.