Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై చెప్పులు.. స్పందించిన పురంధేశ్వరి

By:  Tupaki Desk   |   29 Nov 2019 10:13 AM GMT
చంద్రబాబుపై చెప్పులు.. స్పందించిన పురంధేశ్వరి
X
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటన నిరసన జ్వాలల మధ్య కొనసాగిన సంగతి తెలిసిందే. రైతుల నుంచి మూడు పంటలు పండే భూములను తీసుకున్న చంద్రబాబు ఐదేళ్లలో అమరావతి లాంటి అద్భుత రాజధాని నిర్మిస్తానంటూ వదిలేసిన వైనంపై రైతులు నిరసన తెలిపారు. ఆయన కాన్వాయ్ పై చెప్పులు విసరడం తెలిసిందే..

కాగా చంద్రబాబుపై అమరావతిలో రైతులు చెప్పులేసిన వైనంపై తాజాగా బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి హాట్ కామెంట్ చేశారు. రాజధాని నిర్మాణంలో పూర్తిగా విఫలమై, నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నాయుడు నిలువునా మోసం చేశారని పురందేశ్వరి శుక్రవారం ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజధాని ఎందుకు కట్టలేదని.. గ్రాఫిక్స్ తో ఎందుకు మోసం చేశారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

అమరావతి నిర్మాణం కోసం రూ.2500 కోట్లు ఇస్తే సరైన లెక్కలు చూపలేదని పురంధేశ్వరి ఆరోపించారు. రాజధానిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని.. వారిది ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.

ఇక ఎమ్మెల్సీ మాధవ్ సైతం చంద్రబాబుకు అమరావతిలో అవమానంపై విమర్శలు గుప్పించారు. అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు వేల కోట్ల రూపాయాలు దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు మోసకాడు అని చెబుతున్నామని.. అందుకే రాళ్లు, చెప్పులు వేశారని.. మండిపడ్డారు. చంద్రబాబు నేర్పిన విద్యనే రైతులు చేశారని గుర్తు చేశారు.