Begin typing your search above and press return to search.

పురంధీశ్వ‌రి రెండు ప్ర‌శ్న‌లకు బాబు జ‌వాబివ్వాల్సిందే

By:  Tupaki Desk   |   9 March 2018 3:50 PM IST
పురంధీశ్వ‌రి రెండు ప్ర‌శ్న‌లకు బాబు జ‌వాబివ్వాల్సిందే
X
మంత్రి ప‌ద‌వుల‌కు గుడ్ బై చెప్ప‌డం అనే సంచ‌ల‌న ద‌శ‌కు టీడీపీ-బీజేపీ మిత్ర‌బంధం చేరిన‌ప్ప‌టికీ...ఆ రెండు పార్టీల నేతలు ఇంకా విమ‌ర్శ‌ల ఎదురదాడి కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి పదవులకు టీడీపీ ఎంపీలు అశోకగజపతి రాజు - సుజనా చౌదరి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి రాజీనామాలను ఆమోదించారు మ‌రోవైపు ఏపీ స‌ర్కారులో భాగ‌మైన ఇద్ద‌రు మంత్రుల రాజీనామాలు సైతం ఆమోదం పొందాయి. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన విషయమై బీజేపీ మహిళా నేత పురందేశ్వరి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఏపీ స‌ర్కారు, తెలుగుదేశం పార్టీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుపై మండిప‌డ్డారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమ‌ని పురందీశ్వ‌రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బీజేపీ సిద్ధంగా ఉందని...అయిన‌ప్ప‌టికీ కొన్ని అంశాల మీద దుష్ప్రచారం జరుగుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్యాకేజీకి- హోదాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం భరిస్తుంది అని అరుణ్ జైట్లీ తెలియచేశార‌ని వివ‌రించారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం కుదరదని అలాగే ప్రత్యేక హోదా అనుభవిస్తున్న 11 రాష్ట్రాలకి కూడా ప్రత్యేకహోదా ఇక నుంచి కొనసాగద‌ని పురందీశ్వ‌రి స్ప‌ష్టం చేశారు. పదేళ్లపాటు హైదరాబాద్ లోనే ఉంటూ అన్నీ చక్కదిద్దుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నది ఎవ‌ర‌ని పురందీశ్వ‌రి ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి లాభం ఉండదని చంద్రబాబునాయుడు స్వయంగా అంగీకరించారని.. అయితే ప్యాకేజీలో భాగంగా డబ్బు తీసుకున్నార‌ని గుర్తుచేశారు. ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని అన్నారు.

ఏపీకి న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పురందీశ్వ‌రి అన్నారు. కేంద్ర విద్యాసంస్థలకు తక్కువ నిధులు ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నార‌ని ఇది చాలా బాధాకరమ‌ని పురందీశ్వ‌రి అన్నారు. ఈ ప్రచారం వెనుక తెలుగుదేశం నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించాలని కేంద్రం భావించడం లేదని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి లాభమేనని ఆ విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు. కేంద్రం చొరవతోనే ఏపీకి పెట్టుబడులు పెరిగాయని పురందీశ్వ‌రి అన్నారు. ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాలకు ఇప్పటికే పన్ను రాయితీలు ఇచ్చారని తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ. 2500 కోట్లు ఇచ్చిందని, అలాగే 1000 కోట్లు గుంటూరు డ్రైనేజీ కోసం ఇచ్చారని పురందీశ్వ‌రి అన్నారు. తాను నాలుగైదు సంవత్సరాలు పోరాడితే కానీ రంగారెడ్డికి ఐఐటీ రాలేదని, అలాంటిది ఏపీకి హామీ ఇవ్వ‌ని ప‌లు విద్యాసంస్థ‌లు వచ్చిన విష‌యాన్ని ఎందుకు వెళ్ల‌డించ‌డం లేద‌న్నారు.