Begin typing your search above and press return to search.

సొంత ఇలాకాలో అందోళనల సంత....?

By:  Tupaki Desk   |   14 Feb 2022 8:30 AM GMT
సొంత ఇలాకాలో అందోళనల సంత....?
X
ఎవరికైనా ఇంట సుఖం ఉండాలి. అక్కడ బాగుంటేనే మిగిలిన లోకమంతా బాగా ఉంటుంది. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలువు అనే సామెత పుట్టింది. ఇదిలా ఉంటే జగన్ కే కాదు, వైఎస్సార్ కాలం నుంచి కూడా కడప జిల్లా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలు ఇచ్చిన ప్రాంతం. ఒక విదంగా కడప కంచుకోట అని చెప్పుకోవాలి. ఎక్కడ సీన్ ఎలా ఉన్నా కడప గడపలో వైఎస్సార్ ఫ్యామిలీకి ఎదురులేదు. రాజకీయాలు, పార్టీలూ అన్నీ కూడా కడపకు ఆవల మాత్రమే. కడపలో చూస్తే అంతా వైఎస్సార్ ఫ్యామిలీ నామస్మరణగానే రాజకీయ కధ జోరుగా సాగిపోతుంది.

అలాంటి కడప జిల్లా జగన్ కి వైఎస్సార్ తరువాత తల్లిలా, తండ్రిలా ఆదరించింది. వైఎస్ జగన్ కాంగ్రెస్ ని వీడి బయటకు వస్తే ఏకంగా అయిదున్నర లక్షల భారీ ఓట్ల మెజారిటీతో లోక్ సభ ఉప ఎన్నికలో ఆయన్ని గెలిపించింది. ఇక 2014 కానీ 2019 కానీ కడపలో వైసీపీది చెక్కు చెదరని బలం. అలాంటి కడపలో ఇపుడు రాజకీయ తేడాలు చాలానే వచ్చేస్తున్నాయి. అక్కడ జనాల అభిప్రాయం ఒక్కసారిగా మారిపోతోంది.

ఎపుడూ జగన్ కి జేజేలు కొట్టే కడప వాసులు ఇపుడు మాత్రం నో అనేస్తున్నారు. దానికి కారణం తాజాగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయమే. ఇది ఎంత వివాదాస్పదం అయింది అంటే ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ముందుకు వచ్చి మరీ వైసీపీ సర్కార్ మీద నిప్పులు చెరిగే పరిస్థితి అన్న మాట.

కొత్త జిల్లాలు వస్తే కచ్చితంగా రాజంపేట జిల్లా అవుతుందని ఆశించిన వారి ఆకాంక్షలకు విరుద్ధంగా రాయచోటికి ప్రభుత్వం జిల్లా కేంద్రం చేసింది. దాంతో రాజంపేట‌, రైల్వేకోడూరు, మ‌ద‌న‌ప‌ల్లె వంటి చోట్ల అధికార పార్టీ మీద పెద్ద ఎత్తున జనాలు తిరగ‌బడుతున్నారు. ఇదేమి జిల్లాల విభజన జగన్ సారూ అని కూడా జనాలు అంటున్నారు.

లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే రాజం పేట కావాలి కదా మధ్యలో రాయచోటి ఎలా వచ్చింది అని నిలదీస్తున్నారు. పైగా జిల్లా కావాలని అడిగిన వారికి కాదని ఇపుడు అడగని వారికి ఇచ్చి ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది అని వారు గుస్సా అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ గొడవ చాలదు అన్నట్లుగా కొత్తగా పొద్దుటూరుని జిల్లా చేయాలని మరో డిమాండ్ తెర ముందుకు వస్తోంది. పొద్దుటూరు వందేళ్ళ క్రితమే మునిసిపాలిటీ అయిన సంగతిని అక్కడి వారు గుర్తు చేస్తున్నారు. పైగా బంగారం వ్యాపారంలో ముంబైకి ధీటుగా ఉన్న పొద్దుటూరుని జిల్లా కేంద్రం చేస్తే మరింతగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు.

తాజాగా ప్రొద్దుటూరులో ప‌లువురు మేధావులు, న్యాయ‌వాదులు, వ్యాపార ప్ర‌ముఖులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేత‌లు, వైద్యులు అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఇక మీదట కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ సమరమే చేస్తామని కూడా చెప్పేస్తున్నారు. అలాగే చూస్తే ఇప్పటిదాకా పాలకులు పొద్దుటూరుకి ఏమీ చేయలేదని, ఇపుడు జిల్లా కేంద్రం అయినా చేయకపోతే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

అంతే కాదు, పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యేకు జిల్లా కేంద్రం చేయమని అడగడానికి కూడా నోరు లేవకపోవడమేంటి అని కూడా మండిపడుతున్నారు. మొత్తానికి చూస్తే కడపలో కొత్త జిల్లాల గొడవలు కాదు కానీ జగన్ కి అవే అతి పెద్ద తలనొప్పిగా మారాయని అంటున్నారు. జగన్ ముందు తన సొంత జిల్లాలో వివాదాలను పరిష్కరించుకుంటేనే తప్ప బయట ప్రాంతాల గురించి మాట్లాడలేరని అంటున్నారు. మరి కొత్త జిల్లాల సెగ కడప చుట్టూ తిరుగుతూ జగన్ కి ఊపిరి సలపనీయకపోతే ఆయన ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉంది.