Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నిక‌ల‌పై ప్రియాంకా గాంధీ ముద్ర‌.. నేత‌ల‌తో చ‌ర్చ‌లు షురూ

By:  Tupaki Desk   |   13 Jun 2021 3:30 AM GMT
యూపీ ఎన్నిక‌ల‌పై ప్రియాంకా గాంధీ ముద్ర‌.. నేత‌ల‌తో చ‌ర్చ‌లు షురూ
X
దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీలూ అలెర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ఇక్క‌డ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అయితే.. గ‌తానికి భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో పార్టీ కీల‌క నేత‌.. స్వ‌చ్ఛందంగా అధ్య‌క్ష ప‌ద‌విని వ‌దులుకున్న రాహుల్ గాంధీని ప‌క్క‌న పెడుతున్నారా? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి.

గ‌త నెల నుంచే..
తాజాగా ప్రియాంక గాంధీ ఇక్క‌డి రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌కు గ‌ట్టి ప‌ట్టున్న పూర్వాంచ‌ల్‌పై ఆమె ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గత నెలలోనే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి , యూపీ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ పూర్వంచల్ లోని 15 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రతి ఒక్కరి నుండి జిల్లా గ్రౌండ్ రిపోర్ట్ ఆమె కోరారు. అట్టడుగు స్థాయిలో పార్టీకి మంచి కృషి చేసిన నాయకుల జాబితాను అడిగారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను కూడా అడిగారు.

పుంజుకునేందుకు ఇదే స‌మ‌యం!
యూపీ వంటి కీల‌క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు ఇదే త‌గిన స‌మ‌య‌మ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్లు చెబుతున్నారు. ప్ర‌ధానంగా క‌రోనా ఫ‌స్ట్, సెకండ్ వేవ్‌ల‌ను ఎదుర్కొన‌డంలో యోగి ప్ర‌భుత్వం స‌హా మోడీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కారు స‌రైన విధంగా స్పందించ‌లేద‌నే భావ‌న యూపీ ప్ర‌జ‌ల్లో ఉంది. ఈ స‌మయంలో దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌కు ఛాన్స్ ఉంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. దీంతో ఓటు బ్యాంకు పెరుగుతుంద‌ని అంటున్నారు.

ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటే..
50 మందికి పైగా సమర్థులైన అభ్యర్థులను ఎన్నికలకు సిద్ధం చేయాలని పార్టీ అగ్ర నాయకత్వం సూచించింది. అలాంటి నాయకులు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్కారానికి కృషి చేయ‌డం ద్వారా కాంగ్రెస్‌కు సానుకూల‌త ఏర్ప‌డేలా చేయొచ్చ‌ని ప్లాన్ చేస్తున్నారు.

పూర్వాంచ‌ల్ ఎందుకంటే..
ప్ర‌స్తుతం ప్రియాంక గాంధీ దృష్టి అంతా పూర్వాంచ‌ల్‌పైనే ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. యూపీలో 33 శాతం అసెంబ్లీ సీట్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పూర్వంచల్‌లో 28 జిల్లాలు ఉన్నాయి. ఇవి రాష్ట్ర రాజకీయ పరిస్థితిని, దిశను నిర్ణయిస్తాయి. ఈ 28 జిల్లాల్లో మొత్తం 162 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గత మూడు దశాబ్దాలలో పూర్వంచల్ ఓటర్లు ఏ ఒక్క పార్టీతోనూ లేరు. రైతుల ఉద్యమం, కరోనా కాలంలో తన పట్టును బలోపేతం చేయడానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ పుంజుకోవ‌డం ద్వారారాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆమె అంచ‌నా వేస్తున్నారు.

సంకేతాలు సానుకూలం..
పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోకపోయినా.. చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు రెండవ లేదా మూడవ స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు ఇది మంచి సంకేతం. పంచాయతీ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ తన సంస్థను బ్లాక్ స్థాయిలో ఎక్కువగా బలోపేతం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా గ్రామాలలో కాంగ్రెస్ బలం పెంచుకోగలిగింది. పంచాయతీ స్థాయిలో ఏది చేసినా దాని ప్రభావం ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ప్రియాంక పూర్వాంచ‌ల్‌పై దృష్టిపెట్టార‌ని తెలుస్తోంది.

ఆరు సూత్రాలతో ముందుకు..
యూపీలో విజ‌యం సాధించేందుకు ఆరుసూత్రాల‌ను ప్రియాంకాగాంధీ ఎంచుకున్నారు.
+ కాంగ్రెస్ కోసం పని చేసే 44 మంది కీల‌కమైన అభ్య‌ర్థుల‌ను ఎంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. + స్వతంత్రులు, ప్రతిపక్ష పార్టీల నుండి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న నాయకులను కాంగ్రెస్ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డంపై దృష్టి పెడుతున్నారు.
+ పార్టీ కోసం త్యాగాలు చేసేవారిని ప్రోత్స‌హించ‌నున్నారు.
+ క్షేత్ర‌స్తాయిలో ఏమీ ఆశించ‌ని వ్యక్తులను పార్టీలో చేర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
+ కాంగ్రెస్ స‌ర్కారు వ‌స్తే.. ఉద్యోగాలు, ఉపాధిపై హామీ
+ యూపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు
+ ముఖ్యంగా రైతులను పార్టీకి కనెక్ట్ చేయ‌నున్నారు. ఇలా.. వ్యూహాత్మ‌కంగా ప్రియాంక ముందుకు సాగ‌నున్నార‌ని తెలుస్తోంది.