Begin typing your search above and press return to search.

మోడీ ప్రభుత్వం వ్యాపారుల కోసమే పనిచేస్తోందా?

By:  Tupaki Desk   |   12 Dec 2021 10:00 PM IST
మోడీ ప్రభుత్వం వ్యాపారుల కోసమే పనిచేస్తోందా?
X
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ జోరు పెంచుతోంది. అధికార బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రైతు ఉద్యమంతో బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా యూపీ రాజకీయాలను బేస్ చేసుకొని వ్యూహాత్మకంగా కదులుతోంది.

తాజాగా కేంద్రప్రభుత్వంపై మరోసారి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు చేశారు. రాజస్థాన్ లోని జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు.

బీజేపీ ప్రభుత్వం వ్యాపారుల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు.

ప్రజల సంక్షేమాల గురించి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో నిత్యావసర ధరలు అన్ని ప్రజలకు అందుబాటులో ఉండేవి అని ఆమె గుర్తు చేశారు.

రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలు చేసిన బీజేపీ ప్రభుత్వం 700మంది రైతుల ప్రాణాలు పోయాక ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్నారు. మొత్తంగా రైతులను బేస్ చేసుకొని బీజేపీ సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ పెద్దలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.