Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కలను ప్రైవేటు ఆసుపత్రులు అలా చెరిపేస్తున్నాయి

By:  Tupaki Desk   |   25 May 2021 10:30 AM GMT
సీఎం జగన్ కలను ప్రైవేటు ఆసుపత్రులు అలా చెరిపేస్తున్నాయి
X
మరే రాష్ట్రంలో లేనట్లుగా.. పేదలు.. దిగువ మధ్యతరగతి వారు మాత్రమే కాదు.. ఒక మోస్తరు మధ్యతరగతి వారికి అభయ హస్తంగా మారింది ఏపీలోని ఆరోగ్య శ్రీ పథకం. ఖరీదైన వైద్యంతో ఆర్థిక సమస్యలతో కూరుకుపోయే కష్టానికి చెక్ చెప్పేలా ఏపీలోని జగన్ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య శ్రీ పేదలకు శ్రీరామరక్షగా మారింది. అయితే.. ప్రైవేటు ఆసుపత్రుల కాసుల కక్కుర్తి.. ఆరోగ్య శ్రీ స్ఫూర్తిని దెబ్బ తీసేలా మారింది.

కరోనాను ఆరోగ్య శ్రీలో చేరుస్తూ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం జగన్. కరోనాను ఆరోగ్య శ్రీలోకి చేర్చటం ద్వారా బాధితులకు ప్రైవేటులో తక్షణ వైద్య సాయం అందుతుందని భావించారు. కాసుల కక్కుర్తిలో కూరుకుపోయిన ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం అందుకు భిన్నంగా.. ప్రభుత్వ లక్ష్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల భయాన్ని కాసుల పంటగా మార్చుకున్న ప్రైవేటు ఆసుపత్రులు.. ఆడ్మిట్ చేసుకునేటప్పుడు ఆరోగ్య శ్రీ కింద చేర్చుకున్నా.. డిశ్చార్జి చేసే వేళలో కొత్త మెలికల్ని పెడుతూ చుక్కలు చూపిస్తున్నాయి. ఓవైపు ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించినట్లుగా కాసులు దండుకుంటూనే.. రోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు అదేమంటే.. రెమ్ డెసివర్ లాంటి మందుల కోసమని చెబుతూ దబాయింపులకు దిగుతున్నారు. కొందరు రోగుల విషయంలో వైద్యం చేస్తామని చెబుతూ.. ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవాలని.. రెమ్ డెసివర్ బయట నుంచి తీసుకురావాలని.. ఇలా ఏదో ఒక మాట చెప్పి హడావుడి చేయటం.. అదేదో మీరే చేయండి.. మేం చెల్లిస్తామన్న మాట వచ్చేలా చేస్తున్నారు.

దీంతో.. ఆరోగ్య శ్రీ కింద చేరిన పేషెంట్లు సైతం చికిత్స ముగిసి.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే నాటికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల మధ్య వసూళ్ల కార్యక్రమాన్ని చేపట్టటం గమనార్హం. సీఎం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరోగ్య శ్రీ స్పూర్తిని ఇంతలా దెబ్బ తీస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చటం ద్వారా బాధితులకు అండగా ఉండాలన్న ఆశయాన్ని దెబ్బ తీస్తున్న కక్కుర్తి ఆసుపత్రులపై కొరడా విదల్చాలన్న మాట వినిపిస్తోంది.