Begin typing your search above and press return to search.

‘‘హోదా’’ వార్తా.. కట్ చేసి పారేయండి!!

By:  Tupaki Desk   |   28 Jan 2017 6:52 AM GMT
‘‘హోదా’’ వార్తా.. కట్ చేసి పారేయండి!!
X
ఏపీ హోదా విషయంలో ఏపీ ప్రజలకు.. మీడియాకు మధ్య దూరం పెరుగుతుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. సాధారణంగా ప్రజాభిప్రాయానికి తగ్గట్లే మీడియా తన వాదనను వినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రజలు కానీ.. న్యాయమైన అంశాల మీద గళం విప్పితే.. మీడియా సహకారం మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఏపీలోని ప్రింట్ మీడియా మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై గళం విప్పుతున్న ఆంధ్రోళ్లకు అండగా అధికార పక్షం అండగా లేదన్న విషయం తెలిసిందే. అయితే.. అగ్రశ్రేణి మీడియా కూడా ప్రజల పక్షాన లేదన్నది తాజా మాటగా మారింది. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించాలని భావించిన శాంతి నిరసనను పోలీస్ పవర్ తో ఎంతగా నిలువరించిందో తెలిసిందే. ప్రజాభిప్రాయం బయటకు రాకుండా ఉండేందుకు.. అనుమతులు లేవన్న పేరుతో శాంతియుత నిరసనకు సైతం నో చెప్పేశారు.

ఇలాంటి సమయాల్లో.. ప్రజల్లో పెల్లుబికుతున్న భావోద్వేగాల్ని మీడియా బయటపెడుతుంది. దీనికిభిన్నంగా అగ్రశ్రేణి దినపత్రికలు కొన్ని సాదాసీదాగా వార్తలు అచ్చేయటం ఇప్పుడు చర్చగా మారింది. జనాభిప్రాయాన్ని పక్కన పెట్టి.. ప్రముఖ మీడియా సంస్థల్లోని డెస్క్ ల్లో పని చేస్తున్న పలువురు పాత్రికేయులతో మాట్లాడినప్పుడు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

హోదాకు సంబంధించిన వార్తలు వస్తే.. వాటికిచ్చే ప్రాధాన్యతను వీలైనంతగా తగ్గించాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. హోదాకు అనుకూలంగా విపక్ష నేతతో పాటు.. ఎవరైనా ఉద్యమకారులకు సంబంధించిన వార్తల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారట. భావోద్వేగ తీవ్రత ఎక్కువగా ఉందన్న విషయం వార్తల్లో పెద్దగా కనిపించకూడదని.. నేతలు చేస్తున్న హడావుడికి తగ్గట్లుగా ప్రజల్లో స్పందన లేదన్నట్లుగా వార్తలు ఉండాలన్న ప్రత్యేక సూచనలు కూడా ఇస్తున్నట్లు చెబుతున్నారు.

అదే సమయంలో.. జగన్.. పవన్ లాంటి వారు హోదా గురించి మాట్లాడిన వార్తలకు సంబంధించిన ట్రీట్ మెంట్ విషయంలోనూ జాగ్రత్తలు చెప్పటం.. వార్త సైజు దగ్గర నుంచి.. వాటి ప్లేస్ మెంట్ వరకూ అన్నింట్లోనూ టోన్ డౌన్ చేయాలన్న మాటను ఓపెన్ గా చెప్పేస్తున్నారని చెబుతున్నారు. వార్తను వీలైనంతగా కోసేయాలన్న మాట కొన్ని మీడియా సంస్థల్లోని జనరల్ డెస్క్ లలో ఓపెన్ గా చెప్పేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. రిపోర్టర్ పంపిన వార్తను వీలైతే పెంచాలని.. లేనిపక్షంలో ఒకట్రెండు లైన్లకు మించి తగ్గితే సదరు వార్త దిద్దిన వారు బాధ్యత వహించాలన్న మాటతో పాటు.. ప్రజల మనోభావాలు దెబ్బ తినే అంశం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండకూడదన్న మాట చాలా స్పష్టంగా చెప్పే వారని గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రా మీడియా సంస్థలు అని తెలంగాణ ఉద్యమ సమయంలో ముద్ర పడిన పత్రికల్లో అప్పుడు అలాంటి పరిస్థితి ఉంటే.. ఇప్పుడు మాత్రం.. ఏపీ ప్రయోజనాలకు మేలు చేసే ప్రత్యేక హోదాపై జరుగుతున్న ఉద్యమ వార్తల్ని.. వీలైనంత కోసేయ్ అనే మాట వినిపించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/