Begin typing your search above and press return to search.

5 రాష్ట్రాల్లోనూ మాదే విజ‌యం.. ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   10 Feb 2022 8:00 AM IST
5 రాష్ట్రాల్లోనూ మాదే విజ‌యం.. ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X
మ‌రికొద్ది సేప‌ట్లో అతి పెద్ద రాష్ట్ర ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలోప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేవారు. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లోనూ విజయం బీజేపీ సొంత‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సంపూర్ణ మెజారిటీతో ఐదు రాష్ట్రాల్లోనూ అధికారం చేపడతామని చెప్పారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజేతగా నిలిచి.. సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు బీజేపీవైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు.

``అందరితో కలిసి- అందరికీ ప్రగతి(స‌బ్ కా సాథ్ .. స‌బ్‌కా వికాస్‌) అనేది మా నినాదం. ఎన్నికలు ఉన్నా, లేకపోయినా.. మా పార్టీ సొంతంగా అధికారంలో ఉన్నా, లేక కూటమిలో ఉన్నా.. ప్రజాసంక్షేమం కోసమే బీజేపీ పనిచేస్తుంది" అని స్పష్టం చేశారు. బీజేపీ ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజావ్యతిరేకత ఉందన్న వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. "స్థిరమైన ప్రభుత్వంతో పాలన సాగించేందుకు బీజేపీ అవకాశం ఎప్పుడు వచ్చినా.. అక్కడ ప్రజావ్యతిరేకత ఉండదు. ప్రజాసానుకూలతే ఉంటుంది. ఈ ఎన్నికల్లోనూ ప్రజాసానుకూలతతో బీజేపీ విజేతగా నిలుస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు.

2014 లోక్సభ, 2017 శాసనసభ, 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని ప్ర‌ధాని వివరించారు. రాజకీయ పార్టీలకు ఒకసారి మాత్రమే అధికారం ఇచ్చే సంస్కృతికి యూపీ వాసులు ఇప్పటికే చరమగీతం పాడారని చెప్పారు. కాగా, ఎన్నిక‌లు మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. ఓటర్ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తాయ‌ని.. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

ఇదిలావుంటే, ఉత్తర్ప్రదేశ్లో తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో భాగంగా 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఫిబ్రవరి 10(గురువారం)న ఓటింగ్ జరగనుంది. 2.27కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. తొలిదశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. తొలి దశ ఎన్నికలు జరిగే ఈ జిల్లాల్లోనే రైతులు ఉద్యమాన్ని చేపట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. దీంతో ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.