Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ అత్యవసర భేటి.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   29 Jun 2021 8:32 PM IST
ప్రధాని మోడీ అత్యవసర భేటి.. ఏం జరుగుతోంది?
X
కేంద్రప్రభుత్వంలో ఏదో జరుగుతోంది. ప్రధాని మోడీ తాజాగా అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హాజరు కావడంతో ఏదో జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు చైనా దిక్కున చైనా సైనికుల మోహరింపు.. ఇటు డ్రోన్ల దాడితో కేంద్రప్రభుత్వం ఏదో చర్య తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

జమ్మూకశ్మీర్ లో డ్రోన్ల దాడులు పెరిగిపోవడంతో కేంద్రప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఏకంగా భారత రక్షణ రంగానికి చెందిన ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడడంతో హైఅలెర్ట్ ప్రకటించారు. దీనిపై ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు రెడీ అయ్యింది. ఏదోఒకటి తేల్చుకునేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా ప్రధాని మోడీ అత్యవసరంగా హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశం కావడంతో ఆ వేడి మరింతగా రగులుకుంది.

జమ్మూకశ్మీర్ సరిహద్దున పాకిస్తాన్ కు 14 కి.మీల దూరంలో భారత ఎయిర్ బేస్ లపై డ్రోన్ల దాడులు చేస్తున్నాయి. ఐఏఎఫ్ స్టేషన్ పై డ్రోన్ల సాయంతో రెండు బాంబులను వేశారు. ఇక కలుచాక్ మిలటరీ స్టేషన్ దగ్గర్లో ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒకటి, సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్ ఎగురుతూ వచ్చాయి. వాటిపై భద్రతదళాలు కాల్పులు జరపగా.. అవి పాకిస్తాన్ వైపు తిరిగి వెళ్లినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. మూడు రోజుల్లోనే మొత్తం 5 డ్రోన్లు భారత భూభాగంలోకి వచ్చి కలకలం సృష్టించాయి.

దీంతో అప్రమత్తమైన కేంద్రం తాజాగా రివ్యూ జరిపింది. ఐఏఎఫ్ స్టేషన్ పై జరిగిన దాడి కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించింది. స్పెషల్ బాంబ్ స్క్వాడ్ లను తరలిస్తోంది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కీలక భేటి నిర్వహించి దీనిపై సన్నద్ధతకు నడుం బిగించారు.