Begin typing your search above and press return to search.

దేశంలో గ‌ర్భిణుల ప‌రిస్థితి ఇంతేనా?

By:  Tupaki Desk   |   16 Sep 2017 1:30 AM GMT
దేశంలో గ‌ర్భిణుల ప‌రిస్థితి ఇంతేనా?
X
దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నామ‌ని, మ‌రో ప్ర‌పంచం, మ‌హా ప్రపంచం దిశ‌గా న‌డిపిస్తున్నామ‌ని చెప్పుకొంటున్న పాల‌కులు క‌నీస వైద్య స‌దుపాయాలు క‌ల్పించడంలోనే దారుణాతి దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఏపీ నుంచి మొద‌లు పెట్టి ఏ రాష్ట్రంలో చూసినా.. క‌నీస వైద్యం క‌రువ‌వుతోంది. మౌలిక స‌దుపాయాల‌కు దిక్కేలేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. కోట్ల‌కు కోట్లు ప్ర‌జ‌ల నుంచి వివిధ ప‌న్నుల రూపంలో వ‌సూలు చేస్తూ.. వారి ప‌బ్బం గ‌డుపుకొనేందుకే పాల‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. గిరిజ‌న ప్రాంతాల్లో మ‌హిళ‌ల వైద్య‌ ప‌రిస్థితి దారుణంగా ఉందంటే.. అర్ధం చేసుకోవ‌చ్చు, కానీ, న‌గ‌రాల్లోని మ‌హిళ‌ల‌కు అందాల్సిన వైద్యం కూడా దారుణంగానే ఉంది.

ఒక బెడ్‌ పై ఇద్ద‌రు బాలింత‌లు - మందుల కొర‌త‌ - వైద్యుల కొర‌త ఇలాంటి స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రులు కునారిల్లుతున్నాయి. చిన్నారుల‌కు సైతం ర‌క్ష‌ణ కొర‌వ‌డుతోంది. మొన్న‌టికి మొన్న యూపీ ఘ‌ట‌న‌ను మ‌రిచిపోక ముందే తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో వెలుగు చూసిన ఘ‌ట‌న అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. విష‌యంలోకి వెళ్తే.. ఆసుపత్రిలో బెడ్స్‌ ఖాళీగా లేవనే కార‌ణంగా.. ఓ గర్భిణీకి చెట్టు కిందే చికిత్స చేశారు వైద్య మ‌హానుభావులు. ఈ దుర‌దృష్ట‌క‌ర‌మైన‌ ఘటన మధ్యప్రదేశ్‌ లో వెలుగు చూసింది. చెట్టు కింద ఇనుప మంచం వేసి, దానికే ఓ సెలైన్‌ పెట్టి గ‌ర్భిణికి వైద్యం అందించిన ఘ‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ ఫొటో ఒక‌టి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూజ అనే మహిళ చికిత్స నిమిత్తం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని బయోరా ప్రాంతంలో ఉన్న‌ ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఆమెకు సెలైన్‌ పెట్టాల్సి ఉంద‌ని వైద్యులు గుర్తించారు. అయితే.. బెడ్స్‌ ఖాళీ లేనందున ఆసుపత్రి సిబ్బంది పూజకు చెట్టు కిందే ఓ ఇనుప మంచం వేశారు. చెట్టు కొమ్మకు సెలైన్‌ పెట్టి ఆమెకు అక్క‌డే వైద్యం చేసేశారు. తీవ్ర క‌ల‌క‌లం సృష్టించిన ఈ ఘటనపై ఆసుపత్రి డాక్ట‌ర్ ఎస్‌ ఎస్‌.గుప్తా స్పందిస్తూ.. విధుల్లో ఉన్న సిబ్బందిని వివ‌ర‌ణ కోర‌తామ‌ని చెప్పారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఓ గర్భిణీకి ఆరు బయట చెట్టుకింద చికిత్స చేయడం సరైనది కాదని అన్నారు.