Begin typing your search above and press return to search.

మారుతీరావు ఆత్మహత్యకు కారకులెవరు?

By:  Tupaki Desk   |   9 March 2020 4:30 AM GMT
మారుతీరావు ఆత్మహత్యకు కారకులెవరు?
X
ప్రేమ.. ఒక కూతురిపై తండ్రికున్న ప్రేమ.. ప్రియుడిపై కూతురుకున్న ప్రేమ.. మొత్తంగా అంతులేని ప్రేమే.. మారుతీరావు ఆత్మహత్యకు దారితీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కుల కట్టుబాట్లు, సమాజపోకడలు, మీడియా విశృంఖలత్వం వారి ప్రేమలో నిప్పులు పోశాయి. చలి కాచుకున్నాయి. చివరకు కూతురుకు భర్తతోపాటు తండ్రి కూడా లేకుండా పోయాడు. ఆ తల్లికి, కూతురుకు మగదిక్కులేని దైన్యం మనకు కనిపిస్తోంది. మిర్యాలగూడలో కూతురు అమృత దళిత యువకుడిని చేసుకుందని ఆగ్రహించిన చంపించిన మారుతీరావు చివరకు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ మొత్తం కథ విషాదంతంగా మిగిలింది.

*కూతురు అమృత తప్పు ఎంత?
ప్రేమించడం నేరం కాదు.. ఎవరు ఎవరిని అయినా ప్రేమించవచ్చు. కళాశాలలో తన క్లాస్ మేట్ అయిన అబ్బాయిని ప్రేమించింది మారుతీరావు కూతురు అమృత. అంతేకానీ అతడి కులాన్ని చూడలేదు. అందంగా ఉన్నాడు. ప్రేమిస్తున్నాడు. కడదాకా తోడుంటానని అన్నాడు. ప్రేమ పుట్టింది. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకునేలా చేసింది. అయితే అమృత చేసిన తప్పల్లా తండ్రి మారుతీ రావును, కుటుంబ సభ్యులను ఒప్పించక పోవడం.. వారిని మెప్పించకపోవడం.. కూతురు పై ఎంతో ప్రేమ ఉన్న తండ్రిని ఆ కూతురే కలిసి మాట్లాడి మెప్పించి చేసుకుంటే ఇంత విషాదం ఉండేది కాదు. ఇంటి నుంచి పారిపోయి దళిత యువకుడిని చేసుకోవడం కూతురు అమృత చేసిన తప్పు. పంచప్రాణాల్లాంటి కూతురు పారిపోయి పెళ్లి చేసుకోవడం.. పైగా దళిత యువకుడి చేసుకోవడం తో మారుతీరావులో పగ రగిలిపోయింది. అదే అమృత భర్తకు దారి తీసింది.

*మారుతీరావు చేసిన తప్పేంటి?
ప్రేమించడం కూతురు చేసిన నేరం కాదు. ఆ ప్రేమను అర్థం చేసుకోక పోవడం మారుతీరావు చేసిన నేరం. ప్రేమించడానికి రంగు రుచి చూడడం మారుతీరావు చేసిన తప్పు. కూతురు దళితుడిని చేసుకుందని ఆగ్రహించిన మారుతీరావు అతడిని చంపించాడు. 21వ శతాబ్ధంలోనూ ఇంకా కులం, మతం, దళితుడంటూ చూసి ఈ అగ్రవర్ణపు వ్యక్తి కూతురు భవిష్యత్తును చిదిమేశాడు. చివరకు ఈ అంతులేని ఊభిలో తనూ బలైపోయాడు.

*సమాజం, మీడియా కాకుల్లో పొడిచారు..
ఒక సంఘటన జరిగింది. తప్పు జరిగి పోయింది. దాన్ని చిలువలు, పలువు చేసి మీడియా చూపడం పెద్ద తప్పు. ఒక కుటుంబంలో జరిగిన హత్యను ఓ మోస్తారు వరకూ చూపిస్తే పోయేది. ఆ కూతురు అమృతను ఇంటర్వ్యూ చేసి తండ్రిపై రెచ్చగొట్టడం.. తండ్రి బెదిరించడం.. ఇరుగుపొరుగు వారు ఈసడించుకోవడంతో మారుతీరావు కుమిలిపోయారు. ఒంటరి అయిపోయారు. చంపిన పార్ట్ నర్స్ కు కూడా శిక్ష పడడం.. వారు ఒత్తిడి తేవడంతో భరించలేకపోయారు. సమాజం వెలివేసి.. మీడియా టార్గెట్ చేసి.. కూతురు కాలదన్ని ఎందుకురా ఈ బతుకు అని చివరు మారుతీరావు మరణానికి దారితీసింది. సమాజం, మీడియా ఒకరి పట్ల చూపిన విద్వేషం కూడా ఆయన మరణానికి కారణంగా చెప్పవచ్చు.. మొత్తం అన్ని కలబోసి ఒక పచ్చటి కుటుంబం ఇలా ఒంటరి అయిపోవడానికి ప్రేమతోపాటు ఇవన్నీ కారణంగా నిలిచాయి.