Begin typing your search above and press return to search.

పాప ప్రాణాలు కాపాడిన ట్వీట్‌

By:  Tupaki Desk   |   1 Jan 2016 11:06 AM GMT
పాప ప్రాణాలు కాపాడిన ట్వీట్‌
X
సామాన్యుల క‌ష్టాలు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఎలా తెలుస్తాయి? పేప‌రుపై తమ స‌మ‌స్య‌ను రాసి.. ఎన్నో క‌ష్టాలు ప‌డి.. మంత్రులను క‌లిసి ఆ ప‌త్రాన్ని వారికిస్తే.. వారు చూసి స్పందించే స‌రికి పుణ్య‌కాలం గ‌డిచిపోతుంది.. ఇది ఒక‌ప్ప‌టి మాట‌. సాంకేతికత ఈ దూరాన్ని పూర్తిగా త‌గ్గించేసింది. ముఖ్యంగా రైల్వే వ్య‌వ‌స్థ‌ సోష‌ల్ మీడియాను పూర్తిగా వినియోగించుకుని సామాన్యుల‌కు చాలా చేరువైంది. ఎవ‌రైనా ఆక‌తాయిలు ఏడిపిస్తున్నా.. ఎవరైనా దారి తెలియ‌క ఇబ్బందులు ప‌డుతున్నా.. ఇలా స‌మ‌స్య ఏదైనా.. చిన్న ట్వీట్ చేస్తే చాలు.. రైల్వే మంత్రి త‌క్ష‌ణం స్పందిస్తున్నారు.

ఇప్పుడు అదే నేప‌థ్యంలో ఆయ‌న ఓ ప‌సిపాప ప్రాణాన్ని కాపాడి దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల మ‌న‌న్న‌లు అందుకుంటున్నారు. ఈ సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే శంకర్ పండిట్.. బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వీహార్‌ లోని తన మామ ఇంటికి భార్య - రెండేళ్ల కూతురితో సహా వెళ్లి తిరిగి అంగ ఎక్స్‌ప్రెస్‌ లో బెంగళూరు వస్తున్నాడు. రైలు బయల్దేరిన కొద్దిసేపటికే శంకర్ కూతురికి వాంతులు - విరేచనాలు మొదలయ్యాయి. తోటి ప్రయాణికులు సాయం చేద్దామనుకున్నా.. ఎవరికీ ఏం చేయాలో తెలియదు. ఆ స‌మ‌యంలో @RailMinIndia అనే ట్విట్టర్ ఐడీకి కాపాడమంటూ ట్వీట్ చేశారు.

సరిగ్గా రెండు నిమిషాల్లో రైల్వే మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఆ నిమిషం నుంచి వరుసపెట్టి రైల్వే అధికారులు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. అక్కడకు దగ్గర్లో ఉన్న అసన్సాల్ స్టేషన్ వద్ద పూర్తిస్థాయి వైద్యబృందంతో కూడిన అంబులెన్సు సిద్ధంగా ఉంది. విషయం ఏమిటంటే, ట్వీట్ చూసిన వెంటనే రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు.. కోల్‌కతాలోని తూర్పు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. ఆ పాపకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అప్పటికే పాప పరిస్థితి కొంత విషమంగా ఉంది. ఆమెను రైల్వే ఆస్పత్రిలో చేర్చి.. వెంటనే చికిత్స చేయడంతో.. కోలుకుంది. పాపకు నయమైన తర్వాత రైల్వే అధికారులు అసనాల్ స్టేషన్ నుంచి బెంగళూరుకు కూడా టికెట్లు కన్ఫర్మ్ చేయించి వాళ్లను సురక్షితంగా పంపారు. దీంతో సురేష్‌ ప్ర‌భుపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.