Begin typing your search above and press return to search.

ఏడాదిలో ఇద్ద‌రు ఎస్ ఐల ఆత్మ‌హ‌త్య‌

By:  Tupaki Desk   |   14 Jun 2017 11:11 AM GMT
ఏడాదిలో ఇద్ద‌రు ఎస్ ఐల ఆత్మ‌హ‌త్య‌
X
తెలంగాణ‌లోని సిద్ధిపేట జిల్లాలో ఒకే పోలీసు స్టేష‌న్లో ఏడాది కాలంలో ఇద్ద‌రు స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సిద్ధిపేట జిల్లాలోని కుకునూరుపల్లి ఎస్‌ ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్‌ రెడ్డి బుధవారం తన సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్ర‌భాక‌ర‌రెడ్డిది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టం‍గుటూరు. ఆయ‌న ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌నే విష‌యంలో పోలీసులు వివ‌రాలు సేక‌రిస్తున్నారు. వృత్తిగ‌త స‌మ‌స్య‌లా.. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఉన్న‌తాధికారుల వేధింపులే కార‌ణ‌మ‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తుండ‌గా పోలీసు అధికారులు మాత్రం అదేమీ లేదంటున్నారు. విచార‌ణ జ‌రిపితే కానీ వాస్త‌వాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం లేదు.

అయితే కుకునూరుప‌ల్లి పోలీసు స్టేష‌న్లో గ‌త ఏడాది కూడా అప్ప‌టి ఎస్ ఐ ఇలాగే రివాల్వ‌ర్ తో కాల్చుకుని చ‌నిపోయారు. 2016 ఆగస్టులో ఇదే స్టేషన్‌ లో ఎస్‌ ఐగా పని చేసిన రామకృష్ణారెడ్డి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన స్థానంలో నియమితుడైన ప్రభాకర్‌ రెడ్డి కూడా ఇప్పుడు అచ్చం అలాగే స్టేష‌న్లోని అదే గ‌దిలో త‌ల‌కు రివాల్వ‌ర్ తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఏడాది కాలంలో ఒకే స్టేషన్‌ లో ఇద్దరు ఎస్‌ ఐలు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అన్న‌ది పోలీసు వ‌ర్గాల్లో క‌ల‌క‌లంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/