Begin typing your search above and press return to search.

ఏపీలోని గ్రామాల్లో కోత మొదలెట్టేశారు.. ఇప్పటికైతే రోజుకు 2- 3 గంటలు

By:  Tupaki Desk   |   11 Oct 2021 4:09 AM GMT
ఏపీలోని గ్రామాల్లో కోత మొదలెట్టేశారు.. ఇప్పటికైతే రోజుకు 2- 3 గంటలు
X
దేశం ఎదుర్కొంటున్న బొగ్గు కొరత నేపథ్యంలో.. విద్యుత్ సంక్షోభం పొంచి ఉందని.. ఏ క్షణంలో అయినా విరుచుకుపడుతుందన్న వార్తలు రావటం తెలిసిందే. ఇప్పుడున్న బొగ్గు నిల్వలతో నాలుగు రోజులు మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండటం.. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో 70 శాతం బొగ్గుతోనే కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 20 శాతం మేర విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఓవైపు పెరిగిన డిమాండ్.. మరోవైపు భారీగా తగ్గిన ఉత్పత్తి నేపథ్యంలో కోతలు మినహా మరోమార్గం లేని పరిస్థితి. యూనిట్ ఒక్కొంటికి రూ.18 పెట్టి కొనేందుకు ప్రయత్నం చేస్తున్నా విద్యుత్ లభించని పరిస్థితి.

ఇలాంటివేళ.. లోడ్ సర్దుబాటు కోసం అవసరాన్ని బట్టి వ్యవసాయ.. గ్రామీణ ప్రాంతాలు రేడియల్ ఫీడర్లకు సరఫరా నిలిపేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండుమూడు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నారు. ఒకవేళ.. అప్పటికి సర్దుబాటుకాని పక్షంలో చిన్న పట్టణాలకు సరఫరా నిలిపివేయాలని భావిస్తున్నారు. గ్రిడ్ భద్రత కోసం కోతలు తప్పట్లేదని.. అధికారులు చెబుతున్నారు. ఏపీలో సాధారణ రోజువారీ విద్యుత్ డిమాండ్ తట్టుకోవటానికి కనీసం 8వేల నుంచి 8500 మెగావాట్ల విద్యుత్ అవసరం.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా వరితో పాటు మెట్ట పంటల సాగు నడుస్తోంది. దీంతో ఈ అవసరాల కోసమే రోజుకు 20 ఎంయూల విద్యుత్ అవసరం. కనీసం ఫిబ్రవరి వరకు నీటిని అందించేందుకు ఈ మాత్రం విద్యుత్ చాలా అవసరం. అదే సమయంలో మార్చి నుంచి వేసవి మొదలు కావటం.. విద్యుత్ వినియోగం భారీగా పెరగటం ఖాయం. ప్రస్తుతం విజయవాడలోని వీటీపీఎస్ లో 21,674 మెట్రిక్ టన్నులు.. కడపలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 62,506 మెట్రిక్ టన్నులు.. నెల్లూరు క్రిష్ణపట్నంలో 75,427 మెట్రిక్టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ఈ లెక్కన చూస్తే విజయవాడలోని థర్మల్ కేంద్రంలో ఒక రోజు విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు..రాయలసీమలోమూడు రోజులకు సరిపడా.. క్రిష్ణపట్నంలో ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో విధిస్తున్న కోత.. చిన్న పట్టణాల్లోనూ విధిస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే.. రానున్న కొద్ది రోజులు.. రాష్ట్ర ప్రభుత్వాలకు అనూహ్యంగా వచ్చి పడ్డ కొత్త తలనొప్పిగా చెప్పక తప్పదు.