Begin typing your search above and press return to search.

దేశంలో తొలి కొవిడ్ పేషెంట్ కు.. మ‌ళ్లీ పాజిటివ్‌! కండీష‌న్ ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   13 July 2021 9:00 PM IST
దేశంలో తొలి కొవిడ్ పేషెంట్ కు.. మ‌ళ్లీ పాజిటివ్‌! కండీష‌న్ ఎలా ఉందంటే?
X
భార‌త్ లో క‌రోనా తొలికేసు 2020 జ‌న‌వ‌రి 30 న‌మోదైంది. చైనాలోని వుహాన్ నుంచి వ‌చ్చిన కేర‌ళ వైద్య‌ విద్యార్థి దేశంలోనే మొట్ట‌ మొద‌ట‌గా క‌రోనా బారిన ప‌డ్డాడు. వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్న త్రిసూర్ కు చెందిన 20ఏళ్ల విద్యార్థి సెల‌వుల్లో ఇంటికి తిరిగి వచ్చారు. అయితే.. అనారోగ్యంగా ఉన్న స‌ద‌రు విద్యార్థిని ప‌రీక్షించ‌డంతో వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. ఆ తర్వాత మ‌రో నాలుగు రోజుల్లో కేరళలో రెండు పాజిటివ్ కేసులు నమోదయయ్యాయి. వీరిద్ద‌రు కూడా చైనాలో చదువుతున్నవారే. ఇలా క్ర‌మ‌క్ర‌మంగా దేశంలో కేసులు పెర‌గ‌డం మొద‌లైంది.

అప్ప‌టి నుంచి మొద‌లైన క‌రోనా దారుణాలు దేశంలో ఏ స్థాయికి చేరాయో తెలిసిందే. దేశంలో తొలి మ‌ర‌ణం మ‌న హైద‌రాబాద్ లోనే మార్చి 12న నమోదైంది. కర్నాటకలోని కల్బుర్గీకి చెందిన 76ఏళ్ల వృద్ధుడు హైద‌రాబాద్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ విధంగా.. మ‌ర‌ణాల లెక్క కూడా మొద‌లైంది. సెకండ్ వేవ్ లో గ‌రిష్టంగా 4 ల‌క్ష‌ల పైచిలుకు కేసులు న‌మోద‌య్యాయి. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే.. దేశంలో క‌రోనాను ముంద‌స్తుగా అడ్డుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చాలా ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది. చివ‌రి మార్గంగా లాక్ డౌన్ విధించింది. మార్చి 24న దేశానికి తాళాలు ప‌డ్డాయి. దీంతో యావ‌త్ దేశం ఇంట్లోనే ఉండిపోయింది. ఆ విధంగా.. ప్ర‌పంచంలో లాక్ డౌన్ విధించిన తొలి దేశంగా భార‌త్ నిలిచిపోయింది. కానీ.. ఈ లాక్ డౌన్ సృష్టించిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చాలా మంది అమాయ‌కుల‌ ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. దేశంలో ఎక్క‌డెక్క‌డో ప‌నుల‌కు వెళ్లిన‌వారు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్ల‌లేక తీవ్ర క‌ష్టాల‌ను అనుభ‌వించారు. ర‌వాణా మొత్తం స్తంభించ‌డంతో.. వంద‌లాది మైళ్లు కాలిన‌డ‌క‌నే వెళ్లిన‌వారు ఉన్నారు. అంత దూరం న‌డ‌వ‌లేక ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక‌, చేయ‌డానికి ప‌నిలేక‌.. తిన‌డానికి తిండిలేక ప‌స్తులున్న‌వారికి లెక్కేలేదు. అత్య‌వ‌స‌ర వైద్యానికి కూడా నోచుకోక ప్రాణాలు విడిచిన అభాగ్యులు ఎంద‌రో!

ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల్లో మొద‌లైన వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌లు కొలిక్కి రావ‌డానికి ఏడాది కాలం ప‌ట్టింది. అవ‌కాశం ఉన్న దేశాల‌న్నీ వ్యాక్సిన్ త‌యారీకి న‌డుం బిగించాయి. మ‌న దేశంలోనూ భార‌త్ భ‌యోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ త‌యారు చేశాయి. అన్ని ప‌రిశోధ‌న‌లూ, అవాంత‌రాలూ పూర్తిచేసుకొని వ్యాక్సిన్ సిద్ధం కాగా.. ప‌రిశీలించిన ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. దాని ప్ర‌కారం.. జనవరి 16, 2021న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కానీ.. ఆ కార్య‌క్ర‌మం న‌త్త‌న‌డ‌క‌ను త‌ల‌పించింది. ఇప్ప‌టికీ వ్యాక్సినేష‌న్ వేగం పుంజుకోనేలేదు. ఇక‌, సెకండ్ వేవ్ సృష్టించిన దారుణం గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుప‌త్రుల్లో క‌నీసం బెడ్లు దొర‌క్క‌.. అత్యంత దారుణంగా ఊపిరి పీల్చుకోవ‌డానికి ఆక్సీజ‌న్ దొర‌క్క ప్రాణాలు కోల్పోయిన వారు ఎంద‌రో! ప్ర‌స్తుతానికి అయితే.. సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టింది. కానీ.. థ‌ర్డ్ వేవ్ భ‌యాలు మాత్రం ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతూనే ఉన్నాయి. దీనికి డెల్టా ప్ల‌స్ వేర‌యంట్ కార‌ణం కావొచ్చ‌ని, ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లోనే.. దేశంలో తొలికేసుగా న‌మోదైన కేర‌ళ విద్యార్థి మరోసారి కొవిడ్ బారిన ప‌డ‌డం క‌ల‌క‌లం రేపింది. త్రిసూర్ కు చెందిన ఆ విద్యార్థిని తాజాగా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు విద్యార్థిని కొవిడ్ టెస్టు చేయించుకోగా.. ఆమెకు పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు అధికారులు గుర్తించారు. యాంటీ జెన్ టెస్టులో స‌ద‌రు విద్యార్థిని పాజిటివ్ వ‌చ్చింద‌ని త్రిసూర్ జిల్లా మెడిక‌ల్ ఆఫీస‌ర్ రీనా తెలిపారు. అయితే.. ఆమెకు పాజిటివ్ ల‌క్ష‌ణాలు ఏమీ లేవ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఆమె క్వారంటైన్ లో ఉన్నారు. కాగా.. స‌ద‌రు విద్యార్థిని ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ తీసుకోలేద‌ని స‌మాచారం. ఆమె ఆరోగ్యం మాత్రం ప్ర‌శాంతంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. దీంతో.. దేశంలోని తొలి పాజిటివ్ కేసు అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.