Begin typing your search above and press return to search.

పోప్ కామెంట్ చేసింది ట్రంప్ గురించేనా?

By:  Tupaki Desk   |   9 July 2017 6:23 AM GMT
పోప్ కామెంట్ చేసింది ట్రంప్ గురించేనా?
X
జర్మనీలో జరిగిన సంపన్న దేశాల జీ-20 సదస్సుపై కేథలిక్ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ నాయకుల మధ్య అత్యంత ప్రమాదకరమైన స‌మావేశం జరిగే అవకాశముందని, దీనివల్ల అంతిమంగా శరణార్థులు బలిపశువుల అయ్యే ప్రమాదముందని పోప్ హెచ్చరించారు. ప్రపంచం గురించి వక్ర దృష్టి కలిగిన శక్తులు ప్రమాదకరమైన రీతిలో చేతులు కలిపే ప్రమాదముందని భావిస్తున్నట్టు త‌న ఆందోళ‌న‌ను వెళ్ల‌డించారు. శ‌ర‌ణార్థుల విష‌యంలో క‌త్తిగ‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించే పోప్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారా అనే సందేహాలు అంత‌ర్జాతీయంగా వినిపిస్తున్నాయి.

ఇటలీకి చెందిన లా రిపబ్లికా పత్రికకు ఇచ్చిన ప్ర‌త్యేక‌ ఇంటర్వ్యూలో పోప్ త‌న మ‌నోభావాలు పంచుకున్నారు. `పేదలు, బలహీనులు, వెలివేసినవారి సమస్య ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య. వారిలో శరణార్థులు కూడా ఉన్నారు. వారి గురించి భయపడే దేశాలున్నాయి. అందుకే జీ-20 అంటే నాకు భయమేస్తుంది. శరణార్థులను అది దెబ్బకొడుతుంది`` అని చెప్పారు. ప్రపంచంలోని సంపన్న ఖండమైన యూరప్‌కు 2015 నుంచి శరణార్థులు వరదలా వస్తున్నారు. సరిహద్దులు మూసేయాలనే ఆలోచనాధోరణిలో యూరప్ నేతలు పడిపోవద్దు అని హితవు చెప్పారు.

ఇదిలాఉండ‌గా...జీ-20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీటులో ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ కూర్చోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రపంచ దిగ్గజ నేతలు కూర్చునే టేబుల్ దగ్గర నుంచి ట్రంప్ లేచి పక్కకు వెళ్లగానే ఆయన కూతురు ఇవాంకా వచ్చి అందులో కూర్చున్నారు. దీంతో అమెరికా అధినేత బంధుప్రీతి ఆరోపణలు మరోసారి దుమారం రేపాయి. తన కుటుంబ సభ్యులను ఆయన వైట్‌ హౌస్ పదవుల్లో నియమించడం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఎన్నిక కాని, అర్హత లేని, శిక్షణ లేని న్యూయార్క్ సోషలైట్ అమ్మాయి అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉత్తమ ప్రతినిధిగా భావిస్తున్నారా? అని అమెరికా చరిత్రకారిణి ఆన్నె యాపిల్‌బాం ట్విట్టర్‌లో ట్రంప్‌ను దుయ్యబట్టారు.