Begin typing your search above and press return to search.

లోకల్‌నేత నేషనల్‌ పాలిటిక్స్‌పై మాట్లాడేశాడు!

By:  Tupaki Desk   |   11 April 2015 5:27 AM GMT
లోకల్‌నేత నేషనల్‌ పాలిటిక్స్‌పై మాట్లాడేశాడు!
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేసేశాడు కాంగ్రెస్‌ నేత, మాజీఎంపీ పొన్నం ప్రభాకర్‌. ప్రధాని చేపట్టిన విదేశీ పర్యటనలపై ఈయన దుమ్మెత్తిపోశాడు. మోడీ స్వదేశంలో తక్కువగా విదేశంలో ఎక్కువగా ఉంటున్నాడని పొన్నం ప్రభాకర్‌ విమర్శించాడు. మోడీ గ్రాఫ్‌ పడిపోతోందని.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్నా ఈయన జనాలకు చేసేందేమీ లేదని పొన్నం వ్యాఖ్యానించాడు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేదని.. స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమాలతో మమ అనిపిస్తున్నాడని పొన్నం అన్నాడు.

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వంటి వ్యక్తిపై న్యాయవిచారణకు ఆదేశించడం ద్వారా మోడీ మరింత చెడ్డపేరు తెచ్చుకొన్నాడని.. స్థూలంగా ప్రధానిగా మోడీ ఫెయిలయినట్టేనని పొన్నం ప్రభాకర్‌ అభిప్రాయపడ్డాడు.

మరి కాంగ్రెస్‌ నేత కాబట్టి కమలం పార్టీకి చెందిన వారిపై ఇలా విరుచుకుపడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే పొన్నం ఇలా ఉన్నట్టుండి జాతీయ రాజకీయాలపై మాట్లాడటమే ఆసక్తికరమైన అంశం. పొన్నం తెలంగాణ లెవల్‌ రాజకీయాలపై మాట్లాడటం వరకూ బాగానే ఉంటుంది కానీ జాతీయ రాజకీయాలు అంటే అవి వేరే రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు మాట్లాడే అంశాలు అనుకొనే దృష్టితో ఉన్న జనాలకు ఇప్పుడు ఈ మాటలు ఆశ్చర్యకరం అనిపిస్తాయి.

వెనుకటికి ఎంపీగా ఉన్న రోజుల్లో పొన్నం ప్రభాకర్‌ లాంటి కాంగ్రెస్‌ నేతలందరికీ వేరే అంశాలగురించి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. వీరు ఎంతసేపూ తెలంగాణ అంశం గురించి.. దానిపై సోనియాగాంధీకి ఉన్న వ్యూస్‌ గురించి మాత్రమే మాట్లాడే వాళ్లు. అయితే ఇప్పుడు వీళ్లకు తెలంగాణ గురించి మాట్లాడటానికి ఏమీ లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో వీరు జాతీయ రాజకీయాలగురించి మాట్లాడేస్తున్నారు. మోడీనే లక్ష్యంగా చేసుకొన్నారు.