Begin typing your search above and press return to search.

యూపీలో ఎన్నిక‌ల సిత్రాలు... చిత్ర‌విచిత్రాలు!

By:  Tupaki Desk   |   15 Jan 2022 9:30 AM GMT
యూపీలో ఎన్నిక‌ల సిత్రాలు... చిత్ర‌విచిత్రాలు!
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. పార్టీలు, నాయ‌కులు.. ప్ర‌చార ప్రారంభించేశారు. ఈ క్ర‌మంలో నాయ‌కులు చేస్తున్న సిత్రాలు.. చిత్ర‌విచిత్రంగా ఉంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ద‌ళితుల ఊసే ఎత్త‌ని సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌.. ఏకంగా ద‌ళితుల ఇంటికే వెళ్లి భోజ‌నం చేయ‌డం.. ఒక సిత్ర‌మైతే.. అస‌లు ఈ దేశంలో బ్రాహ్మ‌ణులు ఉండ‌డం వ‌ల్లే.. అభివృద్ది జ‌ర‌గ‌డం లేద‌ని.. వారిని త‌రిమిత‌రిమి కొట్టాల‌ని పిలుపునిచ్చిన బీఎస్పీ అధినేత మాయావ‌తి.. ఇప్పుడు బ్రాహ్మ‌ణ జ‌పం చేస్తున్నారు. వారి వ‌ల్లే దేశ సంస్కృతి సంప్ర‌దాయాలు నిలుస్తున్నాయ‌ని.. చాటింపు వేస్తున్నారు. ఇలా .. నాయ‌కులు అనేక చిత్రాలు చేస్తున్నారు. ఇవ‌న్నీ.. ఎందుకో తెలిసిందే. యూపీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డ‌మే క‌దా!

ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మకర సంక్రాంతి సందర్భంగా గోరఖ్పుర్లో పర్యటించారు. ఓ దళితుడి ఇంటికి వెళ్లి వారితో పాటు కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఎస్పీ అధికారంలో దళితులు సామాజిక బహిష్కరణకు గురయ్యారని, సామాజిక న్యాయమనేదే లేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం ఎలాంటి వివక్ష లేకుండా కృషి చేస్తోందన్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏం చేశారో మాత్రం చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి.. త‌న కార్యాల‌యంలో సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో తొలిసారి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.. వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిని ఘ‌నంగా స‌త్క‌రించారు. బ్రాహ్మ‌ణులు ఈ దేశానికి సంస్కృతి సంప్ర‌దాయాలు నేర్పించార‌ని.. వ్యాఖ్యానించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు వాస్త‌వానికి బీఎస్పీ.. బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి టికెట్లు ఇచ్చింది లేదు. వారిని పొగిడింది కూడా కానీ. ఇప్పుడు ప‌రిస్థితి మారుతుండ‌డంతో బ్రాహ్మ‌ణ వ‌ర్గాన్ని నెత్తిన పెట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఓ బీఎస్పీ కార్యకర్త అర్షద్ రాణా బోరున విలపించారు. పార్టీ కోసం 24 ఏళ్లుగా కష్టపడ్డా.. చివరి నిమిషంలో తనకు టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం హోర్డింగ్లు కూడా కట్టానని.. ఇప్పుడు ఇలా చేయడం సరికాదని అన్నారు. ముజఫుర్నగర్ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సతీశ్ కుమార్ను కలిస్తే.. రూ. 50 లక్షలు ఏర్పాటు చేయాలని అడిగినట్లు ఆరోపించారు. ఇప్పటికే రూ. 4.5 లక్షలు ఇచ్చానని చెప్పారు. రాణా విలపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మొత్తానికి యూపీ ఎన్నిక‌ల్లో ఇలాంటి సిత్రాలు మున్ముందు ఎన్ని వెలుగు చూస్తాయో చూడాలి.