Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే అలా... అయ్యన్న ఊ అంటారా...?

By:  Tupaki Desk   |   28 Jan 2022 11:30 PM GMT
వైసీపీ ఎమ్మెల్యే అలా... అయ్యన్న ఊ అంటారా...?
X
విశాఖ జిల్లాలో ఇపుడు రాజకీయం బహు చిత్రంగా మారుతోంది. విపక్ష పాత్రలో ఉన్న తెలుగుదేశం కంప్లీట్ సైలెంట్ గా ఉంటే అధికార పార్టీలోనే గట్టిగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఇదంతా కొత్త జిల్లాల మీద రాజకీయ రచ్చగా సాగుతోంది. విశాఖ జిల్లాను మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం కొత్త జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చేసింది.

అందులో విశాఖ సిటీని మాత్రం పాత్ర జిల్లాగా కొనసాగించగా రూరల్ జిల్లాను అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేశారు. అరకు కేంద్రంగా అల్లూరి జిల్లాను చేర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో జిల్లాలో కొత్త డిమాండ్లు వరసబెట్టి వచ్చి పడుతున్నాయి.

అల్లూరి సీతారామారాజు పేరుని అనకాపల్లి జిల్లాకు పెట్టాలని ఒక డిమాండ్ ఉంటే అల్లూరి అనుచరులైన గంటం దొర మల్లు దొరలలో ఒకరి పేరు అరకుకు పెట్టాలని సూచనలు వస్తున్నాయి. వారి పోరాటాన్ని తక్కువ చేయడానికి వీలు లేదని గిరిజన నేతలు గట్టిగా చెబుతున్నారు. ఇక అల్లూరి మైదాన ప్రాంతంలోనే ఎక్కువ పోరాటం చేశారని, అందువల్ల అనకాపల్లి జిల్లాకే ఆయన పేరు సరిపోతుంది అంటున్నారు రూరల్ జిల్లా వాసులు.

ఇదిలా ఉండగా అనకాపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో నర్శీపట్నం నలుగుతోంది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ నాయకత్వాన నర్శీపట్నం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చి పడుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కి ఉమా శంకర్ విన్నపాన్ని ఇచ్చి మరీ వచ్చారు.

ఆ మీదట ఆయన నర్శీపట్నంలోని వివిధ వర్గాల ప్రతినిధులతో భేటీ అయి ఎట్టి పరిస్థితుల్లో నర్శీపట్నాన్ని జిల్లా కేంద్రంగా చేసుకోవడానికి ఏం చేయాలో అదే చేస్తామని స్పష్టం చేసారు. ఇక విధంగా వైసీపీ ఎమ్మెల్యే పట్టుదల మీద ఉన్నారు. ఈ విషయంలో జిల్లాలో అంతా అనకాపల్లికి మద్దతు పలుకుతూంటే ఉమా శంకర్ గణేష్ మాత్రం నర్శీపట్నాన్నే జిల్లా కేంద్రం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నర్శీపట్నం అన్ని విధాలుగా వెనకబడి ఉందని, అదే అనకాపల్లి జీవీఎంసీలో భాగం అయి ఉందని, ఇప్పటికే అక్కడ అంతా అభివృద్ధి జరిగిందని చెబుతున్నారు. పైగా జిల్లా కేంద్రం ఏర్పాటు అయితే భవానాల నిర్మాణానికి రెండు వేల ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో జిల్లా ఆకాంక్షను ఆయన రగిలిస్తున్నారు.

ఈ కీలక సమయంలో మాజీ మంత్రి, నర్శీపట్నానికి పెద్ద దిక్కుగా ఉన్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వైఖరి ఏంటో ఇప్పటిదాకా చెప్పలేదు. ప్రతీ రోజూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వీడియో బైట్స్ వదిలే అయ్యన్న గత కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. మరి ఉమా శంకర్ పోరాటానికి అయ్యన్న ఊ అంటారా లేక ఒహూ అంటారా. అసలు ఎందుకొచ్చిన జిల్లా పోరాటం అని కంప్లీట్ గా సైలెంట్ అవుతారా అన్నదే చూడాలి అంటున్నారు.