Begin typing your search above and press return to search.

ఆ జడ్జిగారి విచారణలో బాంబులు పేలాయ్

By:  Tupaki Desk   |   13 April 2016 10:34 AM IST
ఆ జడ్జిగారి విచారణలో బాంబులు పేలాయ్
X
న్యాయస్థానాల్లో విచారణలో కేసును బట్టి దానికి సంబంధించిన అంశాలను జడ్జిలు కూలంకుషంగా తెలుసకుంటారు. తాజాగా ఓ కేసులో అలాగే జడ్జి ఒకరు బాంబు ఎలా పనిచేస్తుందో చూపించమని పోలీసులను అడిగారు... ఓకే అన్న కానిస్టేబుల్ బాంబు పిన్ తీయాలని చెప్పడంతో పాటు పిన్ తొలగించడంతో కోర్టు హాల్లోనే బాంబు పేలిపోయింది. దీంతో ఆ కానిస్టేబుల్ స‌హా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

పాకిస్థాన్‌ లోని ఓ ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో తీవ్రవాదానికి సంబంధించిన కేసొకటి విచారణ జరుగుతోంది. అసలు గ్రెనేడ్ ఎలా పనిచేస్తుందో చెప్పాలని పోలీసులను జడ్జి అడిగారు. దాన్ని థిరిటకల్ చెప్పాల్సిన కానిస్టేబుల్ ఏకంగా ప్రాక్టికల్స్ చేసి చూపించారు. గ్రెనేడ్ పిన్ ను తొలగించడంతో అది భారీ శబ్దంతో కోర్టు హాల్లోనే పేలింది.

ముగ్గురు గాయపడడానికి కారణమైన ఈ ఘటనతో జడ్జి అదిరిపోయారట. గ్రెనేడ్ ప‌నితీరును తెలుసుకుంటే త‌న కోర్టుకొచ్చే కేసుల్లో విచార‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఉద్దేశంతోనే ఆయన్ను అడిగానని... కానీ ఆయన దాని పిన్ తొలగించాలని చెప్పడంతో పాటు తొలగించడంతో ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన చెందుతున్నారట. అయితే, దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణలో పూర్తి వివరాలు తెలుసుకోవడం ముఖ్యమే కానీ, ఇలా ప్రమాదకరంగా ఆరాలు తీస్తే ప్రమాదమేనని అంటున్నారు.