Begin typing your search above and press return to search.

నడిరోడ్డుపై బైఠాయించిన ఎంపీ ....కారణం ఇదే !

By:  Tupaki Desk   |   28 April 2020 7:00 PM IST
నడిరోడ్డుపై బైఠాయించిన ఎంపీ  ....కారణం ఇదే !
X
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే పశ్చిమ బెంగాల్ లో ఒక బీజేపీ ఎంపీ రోడ్డు మీద బైఠాయించారు. బెంగాల్‌ లోని దక్షిణ దీనాజ్‌పూర్ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సుకుంటా మజుందార్‌ ను లాక్‌ డౌన్‌ కారణంగా తన సొంత నియోజకవర్గంలోకి పోలీసులు అనుమతించడంలేదు. గత ఇరవై రోజులుగా దీనాజ్‌పూర్‌ లోకి ప్రవేశించేందుకు ఎంపీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ స్థానిక పోలీసులు అతన్ని అడ్డుకుంటున్నారు.

దీనితో అయన తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ సొంత నియోజకవర్గంలోకి అనుమతించడంలేదని మంగళవారం నడిరోడ్డుపై బైఠాయించారు. కరోనా కష్టకాలంలో తనను గెలిపించిన పేదలకు సేవచేయాలని భావిస్తున్నానని, కానీ దీనిని ప్రభుత్వం అడ్డుకోవడం సరైనది కాదని విమర్శించారు. ప్రజలకు సేవ చేసేందుకు సొంత నియోజక వర్గానికి మంగళవారం, ఏప్రిల్ 28న వెళ్తుంటే పోలీసులు అయన్ను ఆపి వేశారు. దీంతో ఆయన నడిరొడ్డుపై బైఠాయించారు.

దీనిపై అధికార తృణమూల్‌ పార్టీ నేతలు స్పందించారు. బీజేపీ నేతలు లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు. అందుకే బీజేపీ నేతల్ని అనుమతించడంలేదని అధికార పార్టీ నేతలు వివరించారు. అటు పోలీసులు కూడా ఎంపీ విమర్శలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నందున ఎవరినీ అనుమతించడంలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే తాము విధులను నిర్వర్తిస్తున్నామని పోలీసులు తెలిపారు.