Begin typing your search above and press return to search.

మోడీ చదివిన పిటిషన్ల ‘లెక్క’ చెప్పిన పీఎంవో

By:  Tupaki Desk   |   11 Oct 2016 7:26 AM GMT
మోడీ చదివిన పిటిషన్ల ‘లెక్క’ చెప్పిన పీఎంవో
X
నిజమే.. ఆసక్తికరమైన ప్రశ్నే. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని.. ఎన్నో కీలక అంశాలకు సంబంధించిన ప్రశ్నలు పలువురు ప్రశ్నిస్తుండటం కనిపిస్తుంది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు నమోదైంది. ప్రధానమంత్రికి నిత్యం ఎన్నో దరఖాస్తులు వస్తుంటాయి కదా? వాటిల్లో ప్రధాని మోడీ వ్యక్తిగతంగా చదివిన పిటిషన్ల సంఖ్య ఎంత? అంటూ ఒకరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం డేటాను పరిశీలించింది. అనంతరం ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది.

2014 మే 1 నుంచి జనవరి 31 వరకూ ప్రధానమంత్రి కార్యాలయానికి 10 లక్షల పిటిషన్లు వచ్చినట్లుగా ప్రధాని కార్యాలయం పేర్కొంది. అయితే.. వీటిల్లో ప్రధాని మోడీ వ్యక్తిగతంగా చదివిన పిటిషన్లు ఎన్ని అన్న సమాచారం తమ వద్ద లేదని పీఎంవో పేర్కొంది. ప్రధానమంత్రి వ్యక్తిగతంగా చదివిన పిటిషన్లకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. అయితే.. ప్రధాని కార్యాలయానికి వచ్చిన 10 లక్షల పిటిషన్లను తాము పరిశీలించినట్లుగా పేర్కొన్న పీఎంవో.. ప్రధాని వ్యక్తిగతంగా ఎన్ని పిటిషన్లను చదివారన్న సమాచారాన్ని ప్రత్యేకంగా నమోదు చేయాలేదన్న సమాధానాన్ని వెల్లడించారు.

చూస్తుంటే.. ప్రధానమంత్రికి పిటిషన్లు భారీగా వచ్చినా.. ఆయన వరకూ వెళ్లేవి దాదాపు ఏమీ లేవన్న భావన కలిగేలా సమాధానం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ వాదన సరికాదన్న మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. పీఎంవో ఇచ్చిన సమాధానాన్ని చూస్తే.. ప్రధానికి వచ్చిన పిటిషన్లలో ఎన్నింటిని మోడీ చదివారన్న అంశాన్ని తాము నమోదు చేయలేదని.. దీనికి సంబంధించిన సమాచారం నిర్దిష్టంగా లేదని పేర్కొన్న నేపథ్యంలో.. పిటిషన్లు ఎన్ని చదివారన్న స్పష్టత మాత్రమే లేదని చెప్పాలే కానీ అస్సలు చదవలేదన్న వాదన సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ప్రధానికి వచ్చిన పిటిషన్లను సంబంధిత శాఖలకు చేరవేసినట్లుగా పీఎంవో పేర్కొనటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/