Begin typing your search above and press return to search.

ఏర్పేడు ఘ‌ట‌న‌పై మోడీ టీం ఆరా!

By:  Tupaki Desk   |   28 April 2017 5:08 AM GMT
ఏర్పేడు ఘ‌ట‌న‌పై మోడీ టీం ఆరా!
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని ఏర్పేడులో జ‌రిగిన అనుమాస్ప‌ద రోడ్డు ప్రమాదం, అందులో ఇసుక మాఫియా హ‌స్తం ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసే ట‌ట్లు క‌నిపిస్తోంది. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా అనేక మంది గాయపడిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఏర్పేడు ఘటనలో అస‌లేం జ‌రిగింది? ఈ ఘ‌ట‌న‌కు ఇసుక మాఫియాకు సంబంధం ఏంటి? రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తోంది? వంటి అంశాల‌పై ఆరా తీయాల‌ని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ)కు ప్ర‌ధాని సూచించినట్లు స‌మాచారం. ఈ మేర‌కు సమగ్ర నివేదిక అందజేయాలని చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందింది.

ఏర్పేడు ఘ‌ట‌న‌లో మరణించిన, గాయపడిన వారి వివరాలు అందివ్వాలని ప్ర‌ధాన‌మంత్రి కార్యాలయం చిత్తూరు జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ర్గాల‌ను ఆదేశించింది. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షలు - గాయపడిన వారికి 50వేల రూపాయలను ప్రధాన మంత్రి తరఫున ఆర్థిక సహాయం అందజేయనున్నారని స‌మాచారం. కాగా, తీవ్ర వివాదాస్ప‌దం అయిన ఏర్పేడు ఘ‌ట‌న‌ ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి వెళ్ల‌డం రాజకీయ‌, అధికార వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని ప‌రిణామాల‌ను ప్ర‌ధాన‌మంత్రి మోడీ - కేంద్ర ప్ర‌భుత్వం చాలా నిశీతంగా గ‌మ‌నిస్తుంద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం అని ప‌లువురు పేర్కొంటున్నారు.

స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలోని పాపానాయుడు పేట - మునగల పాల్యెం - చెల్లూరు - గోవిందవరం - మోదుగుల పాల్యెం,కోబాక గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని తమ పొలాల్లోని ఇసుకను సైతం ఇసుక మాఫియా వదలకుండా తరలిస్తున్న తీరుపై వారు అనేక పర్యాయాలు రెవిన్యూ అధికారులకు, స్థానిక పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా వారి గోడు విన్నవారే తప్ప ఆ సమస్యలను పరిష్కరించేవారు కనిపించలేదు. అదే సమయంలో దాదాపు 50 మంది మునగలపాల్యెం వాసులు ఇదే విషయమై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే ఇది రెవెన్యూ అధికారుల పరిధిలోకి వస్తుందని, తాము దీనిపై కేసులు నమోదు చేయలేని ఎస్పీ చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు. అయితే ఊహించని విధంగా వారిపైకి దూసుకువచ్చిన లారీ వారి ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ పరిస్థితిలో ఈ ప్రమాదానికి కారణం ఇసుక మాఫియానే అనే అనుమానాలు వ్యక్తం అయినా అది నిజం కాదని లారీ డ్రైవర్ మద్యం సేవించడం, మలుపు వద్ద సున్నపు రాయి ఉన్న భారీ లారీ వేగాన్ని డ్రైవర్ నియంత్రించక పోవడం కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇసుక మాఫియాపై వారు చేసిన పోరాటం మాత్రం ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ఒకే గ్రామానికి చెందిన 15 మంది మృత్యువాత పడటం జిల్లా వాసులను కలచివేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/