Begin typing your search above and press return to search.

ఏపీ రాజధాని గురించి పీఎంవో ఆరా తీసిందా?

By:  Tupaki Desk   |   23 July 2020 1:00 PM GMT
ఏపీ రాజధాని గురించి పీఎంవో ఆరా తీసిందా?
X
మూడు రాజధానుల బిల్లు గవర్నర్ వద్దకు చేరడం.. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొడంతో ఇదంతా హాట్ టాపిక్ గా మారింది. చర్చనీయాంశమైన ఈ ఉదంతంపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసినట్టు తెలిసింది. ఏపీ రాజధాని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యాలయంతోపాటు రాజ్ భవన్ నుండి పీఎంవో ఆరా తీసింది. హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి జివిఆర్ శాస్త్రి ఎపి రాజధాని తరలింపు గురించి పిఎంఓకు లేఖ రాసినట్లు సమాచారం.

శాస్త్రి తన లేఖలో సీఆర్డిఏ రద్దు ప్రతిపాదన.. వైయస్ఆర్సిపి ప్రభుత్వం ఏపీ గవర్నర్ కు ఆమోదం కోసం పంపిన ‘మూడు రాజధానులు’ బిల్లులను ప్రస్తావించారు. ఈ లేఖపై స్పందించిన పీఎంఓ ఏపీ రాజ్ భవన్‌కు ఫోన్ చేసి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

ఏపీ ప్రభుత్వం ‘మూడు రాజధానుల’ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి పరిణామాలు వేగంగా మారాయి. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) దీనిలో ఒక్కసారి కూడా జోక్యం చేసుకోలేదు. రాజధాని మార్పు పూర్తిగా రాష్ట్ర అంతర్గత వ్యవహారాలు అని చాలామంది భావించారు. చివరకు మొత్తం సమస్యపై పీఎంవో ఆరాతీయడంతో ఇప్పుడు ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

ఏపీ గవర్నర్ కార్యాలయానికి బుధవారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు వచ్చాయని తెలిసింది. ఇప్పుడు అందరి దృష్టి గవర్నర్ నిర్ణయంపై ఉంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను నియమించాలని గవర్నర్ ఇప్పటికే సిఫారసు చేసి జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మూడు రాజధానుల బిల్లులను తిరస్కరిస్తారని ప్రతిపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పీఎంవో ఆరాతీయడంతో ఈ విషయంలో గవర్నర్ ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.