Begin typing your search above and press return to search.

మోడీని ఆటాడుకుంటున్న మ‌ల‌యాళీలు

By:  Tupaki Desk   |   11 May 2016 8:24 PM IST
మోడీని ఆటాడుకుంటున్న మ‌ల‌యాళీలు
X
ఆల్రెడీ ఒక‌సారి ఢిల్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అతి వ్యాఖ్యానాలు చేసి అడ్డంగా బుక్క‌య్యాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఛాయ్ వాలానంటూ సామాన్యుల‌కు చేరువై... నిరుడు ఢిల్లీ ఎన్నిక‌ల ముందు మాత్రం అహంగారం ప్ర‌ద‌ర్శించి అక్క‌డి ఓట‌ర్ల ఆగ్ర‌హానికి గురయ్యాడు. ఐతే ఆ అనుభ‌వం నుంచి పాఠాలు నేర్వ‌కుండా మ‌రోసారి నోరు జారి బుక్క‌య్యాడు మోడీ. కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌చారానికి వెళ్లిన మోడీ.. ఆ రాష్ట్రాన్ని సోమాలియాతో పోల్చ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మాట్లాడుతూ... దేవుని సొంత దేశం అని పేరున్న కేరళలో శాంతి భద్రతలు సోమాలియా కంటే దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ కార్యకర్తల హత్య - దళిత యువతిపై అత్యాచారం.. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఐతే మోడీ లేవనెత్తిన స‌మ‌స్య‌లు ప‌క్క‌కు వెళ్లిపోయి.. ఆయ‌న తెచ్చిన సోమాలియా పోలిక‌పై మ‌ల‌యాళీలు మండిప‌డుతున్నారు.

మలయాళంలో సూప‌ర్ హిట్ అయిన ఓ సినిమాలోని డైలాగ్ 'పో మోనే దినేశా' కు పేరడీగా 'పో మోనే మోడీ' (ఇక చాలు, ఇంటికెళ్లు) అని మోడీని దెప్పిపొడ‌స్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ట్విట్ట‌ర్లో ఈ హ్యాష్ ట్యాగ్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రోవైపు మోడీ విమ‌ర్శ‌ల‌పై కేర‌ళ ముఖ్య‌మంత్రి ఊమెన్ చాందీ కూడా స్పందించాడు. కేరళను సోమాలియాతో పోల్చడం దేశ ప్రధానిగా ఆయనకు సిగ్గుచేటు కాదా అని ఆయ‌న‌న్నారు. మిగ‌తా రాజ‌కీయ ప‌క్షాలు కూడా మోడీపై మండి ప‌డుతున్నాయి. అన్నిటికంటే జ‌నాల నుంచి వ‌స్తున్న స్పంద‌నే బీజేపీ వ‌ర్గాల‌కు షాకిస్తోంది. మోడీ వ‌చ్చి పార్టీకి మేలు చేస్తాడ‌నుకుంటే మ‌రింత వ్య‌తిరేక‌త తెచ్చిపెడుతున్నార‌ని వారు బాధ‌ప‌డుతున్నారు.